గుంటూరు జిల్లా వైసీపీలో కలకలం...జగన్ ఉండగానే ఇలా!
గుంటూరు జిల్లా:వైసిపి అధినేత జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో ఉండగానే పార్టీకి సంబంధించి ఇదే జిల్లాలో చోటు చేసుకున్న ఓ పరిణామం కలకలం సృష్టించింది. నర్సరావుపేట నియోజక వర్గం పరిధిలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు సరిగ్గా వైసిపి అధినేత జగన్ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడే పతాక స్థాయికి చేరాయి. పార్టీ అధినేత పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఏకంగా ఒక గ్రూప్ బహిష్కరించడం పార్టీలో కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే...
కాంగ్రెస్ మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్ రెడ్డి వైసిపి గురజాల ఇన్ ఛార్జ్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కాసు మహేష్ రెడ్డి స్వస్థలం నర్సరావుపేట కావడంతో...అక్కడ స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గానికి, కాసు మహేష్ రెడ్డి వర్గానికి మధ్య పొసగక పోవడంతో సమస్యలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో ప్రస్తుతం వైసిపి అధినేత జగన్ గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా ఈ గ్రూప్ రాజకీయాలకు ముగింపు పలికేందుకు ఏర్పాటు చేసిన కీలక మీటింగ్ ను ఒక వర్గం బహిష్కరించేంత వరకూ వెళ్లడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
నియోజకవర్గంలో...గ్రూప్ రాజకీయాలు
వైసిపి అధినేత జగన్ గుంటూరు జిల్లా పర్యటన నేపథ్యంలో నర్సరావుపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గానికి, కాసు మహేష్ రెడ్డి వర్గానికి మధ్య విభేధాలకు ముగింపు పలికే లక్ష్యంతో ప్రత్యేకించి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. స్థానిక జమీందార్ ఫంక్షన్ ఫ్లాజాలో సోమవారం జరిగిన నియోజకవర్గ సమావేశానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గం హాజరైనా...కాసు మహేష్రెడ్డి వర్గం హాజరు కాలేదు. దీంతో గ్రూపుల మధ్య రాజీకి చేసిన ప్రయత్నం సఫలం కానట్లయింది.
కాసు మహేష్ రెడ్డి...గైర్హాజరు...
అంతేకాకుండా తమ పార్టీ అధినేత జిల్లాలో ఉన్నారని తెలిసి కూడా కాసు మహేష్ రెడ్డి వర్గం ఏకంగా మీటింగ్ కే హాజరుకాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ నాయకుడు కాసు మహేష్ రెడ్డికి తెలియకుండా ఆయన గ్రూప్ గైర్హాజరు కావడం అసాధ్యం కాబట్టి, దీన్నిబట్టి కాసు మహేష్ రెడ్డి ఎంత అసంతృప్తితో ఉన్నారనేది తేటతెల్లం అయిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఎమ్మెల్యేపై గుర్రు...అగ్నికి ఆజ్యం
అసలు ఈ గ్రూప్ రాజకీయాలు ఇంతగా ముదిరి పోవడానికి కారణం నర్సరావుపేట నియోజకవర్గం పరిధిలో కాసు మహేష్ రెడ్డి వర్గాన్ని పూర్తిగా విస్మరించడంతో పాటు కనీసం పార్టీ పదవుల్లో కూడా స్థానం కల్పించటం లేదనేది కాసు మహేష్ రెడ్డి వర్గం ఆరోపణ. అలాగే నియోజకవర్గం ప్రచారంలో కనీసం కాసు మహేష్రెడ్డి పేరు కూడా ప్రస్తావించడం తాజాగా అసమ్మతికి మరింత ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయమై ఆదివారం కాసు నివాసంలో అసమ్మతి వర్గం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే అదే రోజు రాత్రి కాసు మహేష్రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనను ఆహ్వానించారు.
ఎమ్మెల్యేనే కారణం...ఆరోపణలు
అయితే ఈ సందర్భంలో కాసు మహేష్ రెడ్డి వర్గీయులు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై విమర్శల వర్షం కురిపించినట్లు తెలిసింది. నర్సరావుపేట నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి వర్గానికి మీరు ప్రాధాన్యత ఇవ్వరా?...ఇవ్వదలుచుకోలేదా?...అని ఎమ్మెల్యేని నిలదీసినట్లు తెలిసింది. అంతేకాకుండా కాసు మహేష్ రెడ్డి వర్గాన్ని విస్మరిస్తే నష్టపోయేది మీరేనని ఎమ్మెల్యేని హెచ్చరించినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అనవసరమైన అపార్థాలు వద్దని...సమస్యలపై అందరం కూర్చొని మాట్లాడుకొని విభేధాలు పరిష్కరించుకొందామని సూచించారట. అందుకోసమే జమీందార్ ఫంక్షన్ ఫ్లాజాలో మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యే గోపిరెడ్డి సూచనను అక్కడే తిరస్కరించిన కాసు మహేష్ రెడ్డి వర్గం నేతలు...తాము ఆ మీటింగ్ కు వచ్చేది లేదని, అలాగే కాసు మహేష్ రెడ్డి హాజరైనా ఒప్పుకోమని స్పష్టం చేసినట్లు తెలిసింది.
ప్రయత్నం...విఫలం...
చెప్పిన విధంగా గ్రూప్ రాజకీయాలకు ముగింపు పలికే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీటింగ్ కు కాసు మహేష్ రెడ్డి గైర్హాజరు కావడం...ఆయన వర్గం నేతలు కూడా ఎవరూ రాకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. స్వయంగా ఎమ్మెల్యే వెళ్లి ఆహ్వానించినా ఇటు కాసు మహేష్ రెడ్డి...ఆయన వర్గం నేతలు హాజరుకాకపోవడం నర్సరావుపేట నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయని అనుకుంటున్నారు. ఈ విషయంపై పార్టీ అధినేత జగన్ జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించేందుకు పూనుకోకుంటే స్థానికంగా పార్టీకి చేటు చేయడం ఖాయమంటున్నారు వైసిపి అభిమానులు.