ఏపీ బీజేపీ కొత్త ఛీఫ్ నియామకం ఆలస్యం ... మాజీ టీడీపీ వర్సెస్ బీజేపీ ఆధిపత్య పోరు ?
ఏపీ బీజేపీ కొత్త ఛీఫ్ ఎంపిక నానాటికీ ఆలస్యమవుతోంది. కొన్నేళ్లుగా టీడీపీ నీడలో ఉండిపోయిన బీజేపీ ఏపీ యూనిట్ ఆ జాడ్యాన్ని వదిలించుకోలేక సతమతమవుతుండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. టీడీపీ నేతలతో ఇన్న రహస్య సంబంధాల కారణంగా బీజేపీ కొత్త ఛీఫ్ ఎంపికలో సీనియర్లు, టీడీపీ నుంచి వచ్చిన ఎంపీలు జోక్యం చేసుకుని లాబీయింగ్ చేస్తుండటంతో కొత్త ఛీఫ్ ఎంపిక ఆలస్యమవుతున్నట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఏపీ బీజేపీ ఛీఫ్ మార్పు వ్యవహారం..
ఏపీ బీజేపీ అంటే టీడీపీకి అనుకూలంగా పనిచేసే పార్టీ అన్న ముద్ర దశాబ్దాలుగా ఉండిపోయింది. దానికి కారణాలు ఏవైనా ఆ ముుద్ర తొలగించుకునేందుకు కొంతకాలంగా బీజేపీ అదిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గతంలో ఓ సామాజికవర్గం చేతిలో ఉన్న ఏపీ బీజేపీ యూనిట్ పగ్గాలను మరో సామాజికవర్గానికి అప్పగించడానికే బీజేపీకి దశాబ్దాలు పట్టింది. చివరిగా విశాఖ ఎంపీగా పనిచేసిన హరిబాబు నుంచి పగ్గాలను మాజీ కాంగ్రెస్ నేత కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించడం అప్పట్లో ఓ సంచలనం. అయితే గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు బాధ్యతలు చేపట్టిన కన్నా... పార్టీని ముందుండి నడిపించడంలో దారుణంగా విఫలమయ్యారు. దీనికి కారణం పార్టీలో ఆయనకు అండగా ఉన్న వారి ప్రభావమే. ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన నలుగురు ఎంపీల ప్రభావం ఇప్పటికీ కన్నాపై కొనసాగుతోంది. వీరికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకునేందుకు కన్నా సాహసించడం లేదు.
కన్నా వైఖరితో సీనియర్లలో అసంతృప్తి...
ఏపీ బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ అనుసరిస్తున్న వైఖరిపై పార్టీలోని సీనియర్ నేతలు కొందరు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, కార్యక్రమాలు అంతిమంగా బీజేపీకి మేలు చేయకపోగా.. టీడీపీకే ఉపయోగపడతాని వారు భావిస్తున్నారు. దీంతో ఆయన్ను తప్పించేందుకు తెరవెనుక భారీ లాబీయింగ్ చేస్తున్నారు. ఢిల్లీలో తమకున్న పరిచయాలను వాడుకుంటూ కన్నాను తప్పించేందుకు భారీ స్కెచ్ వేశారు. దీనికి ఇప్పటికే అధిష్టానం ఆమోదముద్ర కూడా పడిపోయింది.
కొత్త అధ్యక్షుడి ఎంపికలో రాజకీయం..
ప్రస్తుత అధ్యక్షుడు కన్నాను తప్పిస్తారు సరే.. కానీ పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే విషయంలో గ్రూపు తగాదాలు మళ్లీ మెదలయ్యాయి. పార్టీలో సీనియర్లుగా ఉన్న పలువురి పేర్లను పరిశీలించిన తర్వాత చివరికి ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా కొసాగుతున్న పీవీఎన్ మాధవ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే కన్నాకు అనుకూలంగా ఉన్న మాజీ టీడీపీ, ప్రస్తుత బీజేపీ ఎంపీలు మళ్లీ చక్రం తిప్పడం ప్రారంభించారు. ఢిల్లీలో తమకున్న పరిచయాలను వాడుకుంటూ మాధవ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తప్పించాల్సిన పరిస్ధితే వస్తే ఆయన స్ధానంలో మాధవ్ కు బదులుగా ఇతర పేర్లను పరిశీలించాలని వారు అధిష్టానం పెద్దలను కోరుతున్నారు. కానీ ఈ ప్రతిపాదనను పార్టీలో సీనియర్లుగా ఉన్న ఎంపీ జీవీఎల్ నర్సింహారావు, పురంధేశ్వరి వంటి వారు వ్యతిరేకిస్తున్నారు.
అధిష్టానం మొగ్గు మాధవ్ వైపే...
ఏపీ బీజేపీలో గ్రూపు తగాదాల పరిస్ధితి ఎలా ఉన్నా కొత్త రాజధాని విశాఖ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్ కు అవకాశం ఇస్తే మంచిదనే ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరెస్సెస్ నేపథ్యంతో పాటు వివాదరహితుడు కావడం, కలుపుగోలుతనం ఉన్న మాధవ్ కు అవకాశం ఇస్తే పార్టీలో వివాదాలు అవే సద్దుమణుగుతాయని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అయితే స్ధానిక సంస్ధల ఎన్నికలకు ముందు మాధవ్ ఎంపికను ప్రకటిస్తే దీని ప్రభావం ఎన్నికలపై ఉంటుందని భావించిన అధిష్టానం ప్రస్తుతానికి వాయిదా వేసింది. కానీ అనూహ్యంగా ఎన్నకలే వాయిదా పడటంతో పునరాలోచనలో పడింది. అయితే బీజేపీ పెద్దలతో ఉన్న సంబంధాలతో స్ధానిక నేతలు లాబీయింగ్ చేస్తున్న నేపథ్యంలో అధిష్టానంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. అయితే సాధ్యమైనంత త్వరగా కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తేనే మంచిదని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.