శ్రీవారి భక్తులకు జీఎస్టీ దెబ్బ: నేటి నుంచే వసూలు
నేటి నుంచి తిరుమల భక్తులపై జీఎస్టీ భారం పడనుంది. టీటీడీ అద్దె గదుల కేటాయింపులో జీఎస్టీ వర్తింపజేస్తూ ప్రకటన విడుదల చేసింది. సోమవారం నుంచి టిటిడి అద్దె గదులకు సంబంధించి అదనపు పన్ను వసూలు చేయనుంది.
తిరుమల: సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చి వసతి పొందే శ్రీవారి భక్తులకు ఇ కనుంచి వస్తుసేవల పన్ను(జిఎస్టి) పన్ను భారం పడనుంది. దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అద్దె గదుల కేటాయింపులో జీఎస్టీ వర్తింపజేస్తూ ప్రకటన విడుదల చేసింది.
సోమవారం నుంచి టిటిడి అద్దె గదులకు సంబంధించి అదనపు పన్ను వసూలు చేయనుంది. అయితే రూ.1000లోపు అద్దె గదులకు మాత్రం జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చింది. రూ.వెయ్యి నుంచి రూ.2వేల అద్దె గదులపై 12 శాతం జీఎస్టీ విధించింది.
ఇక రూ.2,500 నుంచి రూ.6వేల అద్దె గదులపై 18 శాతం అమలు చేయనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ నుంచి టీటీడీకి మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అయితే తిరుమలకు ఇస్తే దేశంలోని మిగతా ప్రముఖ దేవాలయాలూ కోరతాయంటూ రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించిన సంగతి తెలిసిందే.