దేవుడికీ తప్పని పన్ను పోటు: ఏపీలో జీఎస్టీ పరిధిలోకి 179 ఆలయాలు..
జీఎస్టీ ఎఫెక్ట్ అటు దేవాలయాలపై కూడా పడింది.రూ.20లక్షల ఆదాయాన్ని మించిన దేవాలయాలను కేంద్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఆలయ ఈవోలకు వాణిజ్య పన్నుల అధికారులే లేఖలు కూడా రాశారు.
విజయవాడ: శుక్రవారం అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఉన్న పన్నుల స్థానంలో కేంద్రం నిర్ణయించిన నాలుగు శ్లాబుల పన్నులు అమలులోకి వచ్చాయి. ఈ ఎఫెక్ట్ అటు దేవాలయాలపై కూడా పడింది.
బైక్స్పై జీఎస్టీ ఎఫెక్ట్?: ఎవరికి లాభం?; తగ్గేవి.. పెరిగేవి.. ఇదీ జాబితా!
రూ.20లక్షల ఆదాయాన్ని మించిన దేవాలయాలను కేంద్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఆలయ ఈవోలకు వాణిజ్య పన్నుల అధికారులే లేఖలు కూడా రాశారు. దీంతో ఏపీలోని మొత్తం 23,834 ఆలయాల్లో 179ఆలయాలు జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. వీటిలో రూ.25లక్షల ఆదాయాన్ని మించిన ఆలయాలు 7 ఉండటం గమనార్హం.
దేవాలయాల ఆదాయాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం.. ప్రసాదంపై మాత్రం అందుకు మినహాయింపు ఇచ్చింది. అయితే ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి, జీడిపపప్పుపై మాత్రం పన్ను బాదుడు తప్పలేదు. దేవాలయాల్లో వినియోగించే అగరబత్తులు, అద్దెగదులు, వివిధ సేవల టికెట్లు, హుండీలు, తలనీలాలు, తదితరాలపై జీఎస్టీ అమలవనుంది.
అయితే ఒక్క తిరుపతి పుణ్యక్షేత్రంలో మాత్రం తలనీలాలపై జీఎస్టీకి మినహాయింపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం ఈ వెసులుబాటు కల్పించింది.