క్రికెట్ బెట్టింగ్: సిటీలో గుజరాతీ యువకుడి అరెస్టు
హైదరాబాద్: వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు క్రికెట్ బెట్టింగను మార్గంగా ఎంచుకున్న గుజరాతీ యువకుడి గుట్టురట్టు చేశారు టాస్క్ఫోర్సు పోలీసులు. సుమారు రూ. 92వేల నగదుతో పాటు బెట్టింగ్కు వినియోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాదులోని ఆబిడ్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి - సిఖిందర్బాయ్ ఎన్ ఛరానియా(34) 15 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించగా, ఎక్కడా లభించలేదు. దీంతో ఫీల్ఖానాలో రాయల్ నావెల్టీసి పేరిట షాపు ప్రారంభించాడు.
వ్యాపారంలో భారీగా నష్టం రావటంతో షాపు మూసివేసిన ఎన్ ఛారానియా తక్కువ కాలంలో ఎక్కువ మొత్తం డబ్బు సంపాదించేందుకు క్రికెట్ బెట్టింగ్లను మార్గంగా ఎంచుకున్నాడు. చిరాగ్ అలీ లేన్లో తాము నివసిస్తున్న అద్దె ఇంట్లో క్రికెట్ బెట్టింగ్లను నిర్వహించటం మొదలుపెట్టాడు.
విశ్వసనీయంగా సమాచారం తెల్సుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు ఛారానియా ఇంటిపై దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. అతని ఇంటి నుంచి ఎనిమిది సెల్ఫోన్లు, ఓ ల్యాప్టాప్, ఎల్ఇడి టీవిలతో పాటు రూ. 92వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ కోసం ఆబిడ్స్ పోలీసులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.