సోము వీర్రాజు వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన గుడా చైర్మన్
రాజమహేంద్రవరం:సిఎం చంద్రబాబుపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గన్నికృష్ణ రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయాలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. 2019లో చేయబోయే కుట్రకు ముందు వార్నింగ్ లాగా ఈ వ్యాఖ్యలు చేశారని తేటతెల్లమవుతోందని గన్ని కృష్ణ చెప్పారు.
2004లో అలిపిరి ఘటన కనిపించిందని, 2019లోనూ అదే జరుగుతుందని సోమూ అన్నారని, ఆ వ్యాఖ్యలను చూస్తుంటే కచ్చితంగా నేరం చేసే ఉద్దేశం కనిపిస్తోందన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అవి ఖచ్చితంగా సీఎం చంద్రబాబుపై కుట్రలో భాగంగానే అన్నట్లుగా అర్థమవుతోందని గోదావరి అర్బన్ డవలప్మెంట్ అథారిటీ (గుడా) చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు.
సోము వీర్రాజు వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేవిధంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రిపై జగన్, పవన్కల్యాణ్లతో పాటు బీజేపీ నేతలు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అయితే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, తమ ప్రాణాలను అడ్డుపెట్టి అధినేత చంద్రబాబును కాపాడుకుంటామని, చంద్రబాబుకు లక్షలాది మంది కార్యకర్తలు, ఐదు కోట్ల ఆంధ్రులు అండగా ఉన్నారన్నారు.
బీజేపీ నాయకులు సీఎం ఇంటిపై రాళ్లు రువ్వారని, దిష్టిబొమ్మలను దహనం చేశారని... అటువంటి సంస్కృతీ, సంప్రదాయాలు తమ నాయకుడు తమకు నేర్పలేదని, నిస్వార్థంగా పని చేయడమే ఆయన నేర్పించారన్నారు. విజయసాయిరెడ్డి, జగన్, సోము వీర్రాజు వంటి నేతల కుట్రలను తాము చట్టబద్ధంగానే ఎదుర్కొంటామని గన్ని కృష్ణ చెప్పారు.