గీతం ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంటే టీడీపీ గగ్గోలు ఎందుకో .. గుడివాడ అమర్ నాథ్
గీతం యూనివర్సిటీలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఈరోజు ఉదయం జీవీఎంసీ అధికారులు కూల్చివేతకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు గీతం యూనివర్సిటీ లో కూల్చివేతపై భగ్గుమంటున్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా మొన్న సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడ కూల్చి వేసిన అధికారులు, ఇప్పుడు ఏకంగా టిడిపి నాయకుడు నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ కి చెందిన గీతం విద్యా సంస్థల కట్టడాలను కూల్చి వేస్తున్నారు అని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
గీతం యూనివర్సిటీ భవనాల కూల్చివేత.. భారీగా పోలీసుల మోహరింపు .. కారణం ఇదే !!
ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఎవర్ని వదిలి పెట్టేది లేదన్న గుడివాడ అమర్నాథ్
అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ టీడీపీ నాయకుల తాజా వ్యాఖ్యలపై స్పందించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఎవర్ని వదిలి పెట్టేది లేదంటూ గుడివాడ అమర్నాథ్ హెచ్చరికలు జారీ చేశారు. భూ ఆక్రమణలపై అధికారులు వారి బాధ్యతను వారు నిర్వర్తిస్తే టీడీపీ నేతలు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు, అత్యంత సన్నిహితుడు అని భరత్ కు చెందిన గీతం విద్యా సంస్థలలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటే టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు అంటూ దుయ్యబట్టారు.
ప్రైవేటు యాజమాన్యం ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకోవడం తప్పా ?
ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువ చేసే 40 ఎకరాల భూమిని గీతం యూనివర్సిటీ ఆక్రమించిందని , దీనిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం తప్పని ఎవరైనా చెప్తే క్షమాపణ చెబుతానంటూ గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో ఉంటే ప్రభుత్వం ఎవరికీ చెప్పి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూమిపై కోర్టులో ఎలాంటి కేసులు లేవని, ఓ ప్రైవేటు యాజమాన్యం భూమి ఆక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకోవడం తప్పా అని ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్.
Recommended Video
టీడీపీ కార్యాలయం కూడా ఆక్రమణలోనే ఉందన్న ఎమ్మెల్యే అమర్నాథ్
టిడిపి పోలిట్ బ్యూరోలో ఉన్నవారంతా అవినీతిపరులు అని పేర్కొన్న ఆయన, ఈఎస్ఐ స్కాం లో ఉన్న అచ్చెన్నాయుడుకి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇక విశాఖ టిడిపి కార్యాలయం కూడా ఆక్రమణలోనే ఉందని, భూముల కబ్జాలు చేసిన వారికే టిడిపిలో పదవులు ఇస్తారు అని మండిపడ్డారు. విశాఖలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడతామని సీఎం జగన్ మాట ఇచ్చారని, ఆ హామీ మేరకే ప్రభుత్వ భూముల రక్షణకు నడుం బిగించారు అని పేర్కొన్నారు. వైసిపి హయాంలో గజం భూమి కూడా కబ్జాకు గురి కాదని ధీమా వ్యక్తం చేశారు గుడివాడ అమర్నాథ్.