"త్వరలోనే జైలుకు బాబు.. శిక్ష అనుభవించేంత వయసు కూడా లేదు"
చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోవడం ప్రపంచమంతా చూసిందని, జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయారని ఆరోపించారు.
హైదరాబాద్: సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని వైసీపీ నేత గుడివాడ అమరనాథ్ రెడ్డి ఆరోపించారు. తన అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి పదేపదే జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మరో వైసీపీ నేత కురసాల కన్నబాబు మండిపడ్డారు.
హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అమరనాథ్ రెడ్డి, కన్నబాబు బుధవారం మీడియాతో మాట్లాడారు. జైలు మాట వింటేనే భయపడుతున్న చంద్రబాబు త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమని అమరనాథ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోవడం ప్రపంచమంతా చూసిందని, జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయారని ఆరోపించారు.
పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరిపించేందుకు వెనుకంజ వేశారని చెప్పారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. మరోవైపు విశాఖలో లక్షలాది రూపాయల భూములు ఆక్రమణలకు గురవుతుంటే.. విచారణ జరిపించకుండా తప్పించుకున్నారని ఫైర్ అయ్యారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జైలు శిక్ష పడితే.. అనుభవించడానికి మీకున్న వయసు కూడా సరిపోదని చంద్రబాబును ఉద్దేశించి అమరనాథ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కుట్రతోనే అక్రమంగా జగన్పై కేసులు పెట్టించి జైలుకు పంపించారని ఆరోపించారు. 2019లో ప్రజలంతా చంద్రబాబుకు బుద్ది చెబుతారని చెప్పుకొచ్చారు.
ఇక మరో వైసీపీ నేత కన్నబాబు మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు సిద్దపడటం లేదని ప్రశ్నించారు. హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జగన్పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పేరెత్తందే చంద్రబాబుకు తెల్లవారడం లేదని, నిద్రలోను ఆ పేరు విని ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు.