చంద్రబాబుకు రైతు 'భారీ' షాక్!: రాజధానిలో గెస్ట్హౌస్కు చిక్కులు
అమరావతి: రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో ముఖ్యమంత్రి నివాసానికి యోగ్యమైన అతిథి గృహాన్ని ఎంపిక చేసిన అధికారులు పక్కనే ఉన్న మరొక గెస్ట్ హౌస్ను దానికి అనుసంధానం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ పరిధిలోని కృష్ణానది కరకట్టపై గల లింగమనేని ఎస్టేట్స్ గెస్ట్హౌస్ ఇప్పటికే తాత్కాలిక నివాస గృహంగా గుర్తించారు. వాస్తు ప్రకారం మరమ్మతులు చేపట్టారు. ముఖ్యమంత్రి నివాస గృహానికి అదనపు కార్యాలయాలు అవసరమైనందున మరో గెస్ట్హౌస్ను కూడా కలిపే ప్రయత్నం అధికారులు చేపట్టారు.
కాగా, వాస్తు ప్రకారం సీఎం గెస్ట్హౌస్కు ఈశాన్య ప్రాంతంలో మరో రహదారి ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఆ ప్రదేశంలో పొలం ఉండటంతో సదరు యజమానిని రహదారి నిర్మాణానికి అనువుగా స్థలం అందించాలని కోరారు.
అతను భూమి ఇచ్చేందుకు నిరాకరించారని తెలుస్తోంది. ఒకవేళ ఖచ్చితంగా కావాల్సిన పక్షంలో పొలాన్ని కొనుగోలు చేయాలని కరాఖండిగా చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులు భూ సేకరణ విధానాన్ని అమలు చేయనున్నారని తెలుస్తోంది.
భూమిని మాత్రం ఇచ్చే అవకాశం లేదని, ప్రస్తుత ధర ప్రకారం ఎకరాకు ఏడు కోట్లు చొప్పున చెల్లించాలని, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమైనందున 5 కోట్లకు మించి తగ్గేది లేదంటూ రైతు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు, మరికొన్ని భూములపై భూసేకరణ చేయనున్నారని తెలుస్తోంది.