రీయింబర్స్మెంట్స్పై '1956' ట్విస్ట్, జయశంకర్ పేరు
హైదరాబాద్: తెలంగాణలో ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. 1956కు ముందు తెలంగాణలో స్థిరపడిన వారి పిల్లలకే ఫీజు రీయింబర్సుమెంట్స ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. 1956 తర్వాత వచ్చిన వారి పిల్లలకు ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇవ్వవద్దని మార్గదర్శకాలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మార్గదర్శకాలపై రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో ఉన్న అందరికీ ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తోంది. అయితే తెలంగాణలో ఉన్న ఏపీ విద్యార్థులకు బోధనారుసుం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ససేమీరా అంటోంది. ఈ నేపథ్యంలో మార్దదర్శకాలను సిద్ధం చేశారు. 1956కు ముందు అని మార్గదర్శకాలలో పేర్కొనడం ద్వారా... ఆ తర్వాత వచ్చి తెలంగాణలో స్థిరపడిన వారి పిల్లలకు ఫీజు రీయింబర్సుమెంట్స్ రావు. ఇది ఏపీ వారిని దృష్టిలో పెట్టుకొని చేసినట్లుగా చెబుతున్నారు. అలాగే ఫీజు రీయింబర్సుమెంట్స్కు ఆచార్య జయశంకర్ పేరు పెట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలోనే ఉంచేందుకు పోరాటం: రాజయ్య
ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య పర్యటిస్తున్నారు. భద్రాచలంలో ఐటీడీఏ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలవరం ముంపు ప్రాంతాల విలీనం రాజ్యాంగ విరుద్ధమని, ఆర్డినెన్సును దొడ్డిదారిన తీసుకొచ్చారని అన్నారు.
ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచేందుకు పోరాడుతామన్నారు. భద్రాచలాన్ని నాలుగు రాష్ట్రాలకు ఉపయోగపడేలా మెడికల్ హబ్ గా చేస్తామని ఆయన చెప్పారు. భద్రాచలం ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామని రాజయ్య చెప్పారు. భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ పుణ్యక్షేత్రాలను తిరుపతి స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు.