జర్నలిస్టుల ఇళ్ల పథకానికి మార్గదర్శకాలు ఖరారు:గురువారం నోటిఫికేషన్!
అమరావతి:ఆంధ్రప్రదేశ్ లోని జర్నలిస్టుల గృహ నిర్మాణాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను గురువారం విడుదల చేసేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు.
రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు బుధవారం సచివాలయంలో ఈ విషయమై అధికారులతో చర్చించి మార్గదర్శకాలు ఖరారు చేశారు. ఈ పథకంలో ఇల్లు నిర్మించాలనుకునే జర్నలిస్టు తన భార్య లేదా తల్లిదండ్రుల పేరుతో స్థలం ఉంటే వారి నుండి అఫిడవిట్ సమర్పిస్తే సరిపోతుందని నిర్ణయించారు. అలాగే ఈ పథకం కోసం జర్నలిస్టుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఇందుకోసం సమాచార, గృహ నిర్మాణ శాఖల ఆధ్వర్యంలో వెబ్సైట్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని మంత్రి కాల్వ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. జర్నలిస్టుల అక్రిడేషన్, ఆధార్ నంబర్ల ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించేందుకు వీలుగా ఈ సాప్ట్వేర్ను రూపొందించాలని మంత్రి సూచించారు. వెబ్సైట్ ఎప్పటినుండి అందుబాటులోకి వచ్చేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
ఈ సమావేశంలో సమాచార శాఖ కమీషనర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ డైరెక్టర్ పి కిరణ్కుమార్, ఉప సంచాలకులు మురళీమోహన్బాబు, గృహ నిర్మాణ సంస్థ చీఫ్ ఇంజనీర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే ఈ విషయమై మంత్రిని కలిసిన ఎపిజెఎఫ్, ఎపిడబ్ల్యుజెఎఫ్ బృందాలు జర్నలిస్టులకు గృహ నిర్మాణ పథకం ద్వారా వీలైనంత త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలని మంత్రి కాల్వ శ్రీనివాసులను కోరాయి.