ఢిల్లీ నేతలకా..కేసీఆర్ సిఫార్సులకా: బందరు పోర్టు దక్కేదెవరికి : సీఎం జగన్ ఎవరి వైపు..!!
ఏపీ ప్రభుత్వం బందరు పోర్టు నిర్మాణ పనుల ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పైన జీవోలో సకాలంలో పనులు చేయని కారణంగా రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంది. ప్రభుత్వమే ఈ పోర్టు నిర్మాణం చేస్తుందని చెబుతోంది. అయితే, ఇంత సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక పెద్ద తతంగమే నడిచినట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక వైపు కేసీఆర్ కు బందరు పోర్టు ఇస్తున్నారంటూ టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీనిని ప్రభుత్వం తిప్పి కొట్టింది. ఇక, ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో పోర్టు పనుల ఒప్పందం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన మంత్రాగ ఫలితమే ఈ నిర్ణయం జరిగిందా అనే చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం సాగరమాల కింద ఈ ప్రాజక్టు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వినిపి స్తుంటే..గుజరాత్ కు చెందిన ఒక సంస్థకు ప్రాజెక్టు నిర్మాణం అప్పగిస్తారని..బీజేపీ నేతల కోరిక మేరకు వారికి అప్పగించనున్నారని చెబుతున్నారు.
ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య వరద రాజకీయం ..వరదలపై కూడా రచ్చేనా !!
Recommended Video
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సమయంలో..
జెరూసెలం నుండి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో బందరు పోర్టు పనులు రద్దు చేస్తూ సడన్ గా నిర్ణయం తీసుకున్నారు. నవయుగ సంస్థను పోర్టు పనుల నుండి తప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అందరూ భావించారు. అయితే, ఢిల్లీ పర్యటనలో దీని పైన చర్చలో భాగంగానే ప్రభుత్వం ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి ఈ నెల 13న కీలక సమావేశం జరగనుంది. నవయుగ సంస్థ న్యాయ పోరాటానికి వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ నేతల తో సమావేశ సమయంలో బందరు పోర్టు నిర్మాణం గురించి చర్చకు వచ్చిందని చెబుతున్నారు. దీంట్లో భాగంగానే .. తొలి అడుగుగా ఏపీ ప్రభుత్వం ఒప్పదం రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ విభజన చట్టం ప్రకారం దుగరాజపట్నంలో పోర్టును నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నా..అక్కడ ఏర్పడిన సమస్యల కారణంగా అన్ని అనుమతులు ఉన్న బందరు పోర్టు వైపు కేంద్రం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం ఈ ప్రాజెక్టు సాగరమాల పథకంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నిర్మించాలనే ప్రణాళిక ఉంది. దీని కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ అధికారుల్లో మొదలైంది. సాంకేతిక పరంగా చూస్తే కాంట్రాక్టును రద్దు చేయడం సరైనదేనని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
గుజరాత్ కంపెనీలు..అంబానీ సైతం ఆసక్తిగా..
బందరు పోర్టు నిర్మాణంపై బడా సంస్థల దృష్టి సారించాయనే ప్రచారం జరుగుతోంది. గుజరాత్కు చెందిన రెండు సంస్థలు.. అంబానీ గ్రూపు తదితర సంస్థలు పనులను దక్కించుకునేందుకు తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్లు సమాచారం. తెలంగాణకు సమీపంలో ఉన్న బందరుపోర్టుపై ఆ ప్రభుత్వం దృష్టి సారించిదనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణకు బందరుపోర్టు అప్పగిస్తారనే అంశంపై రాజకీయ దుమారం ఇటీవల కాలంలో చోటు చేసుకుంది. ఇన్ని మలుపుల మధ్య పోర్టు అంశం ఎలా దారి తీస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెల 13వ తేదీ తర్వాతే ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో సత్సంబంధాలు నడుపుతున్న ఏపీ ప్రభుత్వంలోని పెద్దలు..ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ రకమైన ప్రతిపాదన లు తెర మీదకు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ పధకం పేరుతో చేసినా..ఎవరికి అప్పగించినా నిర్దిష్ట సమయంలో పోర్టు నిర్మాణం పూర్తి చేస్తే తమకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా సమాచారం. దీంతో.. ఈ వారంలోనే దీని పైన కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
నవయుగకు మాత్రం అవకాశం లేనట్లే..
టీడీపీ ప్రభుత్వంలో కీలక పనులు దక్కించుకున్న నవయుగ సంస్థను పోలవరం పనుల నుండి.. ఇప్పుడు బందరు పోర్టు పనుల నుండి ఏపీ ప్రభుత్వం తప్పించింది. టీడీపీకి సన్నిహితంగా ఉండే నవయుగ ను ఉద్దేశ పూర్వకంగానే తప్పించారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం తాను నిర్ధేశించుకున్న విధంగానే ముందుకు వెళ్తున్నారు. నవయుగ తిరిగి రివర్స్ టెండర్లలో పాల్గొన్నా.. ఎంత మేరకు వారికి ఈ ప్రాజెక్టు దక్కుతుందనేది సందేహమే. అయితే, ఈ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సిఫార్సుతో అక్కడ ప్రముఖ నిర్మాణాలు చేసిన సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు గా సమాచారం. దీంతో..ఇప్పుడు బందరు పోర్టు భవిష్యత్ పైన ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందీ..ఢిల్లీ సూచనలా..కేసీఆర్ సిఫార్సుల్లో దేనికి ప్రాధాన్యత ఇస్తుందనేది ఆసక్తి కరంగా మారింది.