ఏపీ ప్రభుత్వం చుట్టూ తిరిగినా?, టీ మాత్రం: గుణశేఖర్ సంచలనం
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నంది అవార్డ్స్ జూరీ కమిటీ చైర్మన్ జీవిత రాజశేఖర్పై సినీ దర్శకుడు గుణశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రుద్రమదేవి సినిమాకు అవార్డుల ఎంపికలో అన్యాయం జరిగిందని గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన జ్యూరీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడటంపై గుణశేఖర్ మరోసారి ఘాటుగా స్పందించారు.
తెలంగాణ స్పందించింది.. కానీ ఏపీ మాత్రం
మీడియాతో వివాదంపై శనివారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా రుద్రమదేవి సినిమాకు పన్ను రాయితీ రాకపోవడానికి గుణశేఖర్ సక్రమంగా ప్రయత్నించకపోవటమే కారణమన్న వాదనపై ఆయన వివరణ ఇచ్చారు. తాను నిబంధనల ప్రకారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన వెంటనే అక్టోబర్ 8న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు పన్ను మినహాయింపు కోసం అప్లై చేశానన్నరు. అయితే తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించినా.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మూడు నెలల పాటు కాలయాపన చేసి, తరువాత తన ఫైల్ క్లోజ్ చేశారని తెలిపారు.
స్పందన కరువైంది..
ఈ విషయంపై మంత్రి అయ్యన్న పాత్రుడ్ని కలిస్తే ఆయన ‘నేను అమరావతి వెళ్లాక మీ విషయం మాట్లాడతానని చెప్పి తరువాత ఫోన్ ఎత్తటం మానేశారు' అని గుణశేఖర్ చెప్పారు. మెసేజ్లకు కూడా స్పందించకపోవటంతో.. మరో మంత్రి గంటా శ్రీనివాసరావును సంప్రదించానని తెలిపారు. ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు విషయమై ప్రత్యేక క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, అక్కడ మీ విషయం ప్రస్తావిస్తానన్నారని కానీ తరువాత గంటా కూడా స్పందించలేదని.. ఇక ప్రయత్నించటం వృథా అని భావించి వదిలేశానని గుణశేఖర్ తెలిపారు.
ప్రశ్నించే హక్కు లేదా?
అదే సమయంలో అవార్డు కమిటీ నిర్ణయాలను ప్రశ్నిస్తే మూడేళ్ల పాటు వారిని అవార్డుల ఎంపిక నుంచి బహిష్కరిస్తామనే నిబంధన సరైంది కాదన్నారు. ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందన్న గుణశేఖర్, ఈ నిబంధన కారణంగా చిన్న చిన్న సాంకేతిక నిపుణులు, నటీనటులు తమ ఆవేదనను బయటకు చెప్పుకోలేకపోతున్నారన్నారు.
చంద్రబాబు రాకింగ్.. జీవిత అలా ఎలా అంటారు..?
రుద్రమదేవి సినిమా విషయంలో 2015 నంది అవార్డుల జ్యూరీ చైర్మన్ జీవిత రాజశేఖర్ స్పందించిన తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ముందు బాహుబలితో పోటి పడ్డప్పుడు రుద్రమదేవి వెనకపడిందన్న కమిటీ కనీసం రెండో సినిమాగా అయిన అవార్డు ఇవ్వాలి కదా అని భావించాను.. కానీ అవార్డులు సాధించిన ఏ సినిమాతోనూ రుద్రమదేవి పోటి పడలేకపోయిందని చెప్పటం బాధకలిగించిందన్నారు. అవార్డులు ప్రకటించిన తరువాత జీవిత రాజశేఖర్ చంద్రబాబు పాలన రాకింగ్ అంటూ కామెంట్ చేయటంతో ఆమె విశ్వసనీయతను కోల్పోయారన్నారు. టీడీపీలో చేరాతారా? అంటే వారు అడిగితే చేరతామని మీడియాకు చెప్పడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. జ్యూరీలో అంతా సినిమా వాల్లే ఉండటం కరెక్ట్ కాదని, అదే సమయంలో రాజకీయ లబ్ధి ఆశించే వారికి జ్యూరీలో స్థానం కల్పించటం వల్ల నష్టం జరుగుతుందని గుణశేఖర్ అన్నారు.
నా వెనక ఎలాంటి శక్తులూ లేవు
‘‘రుద్రమదేవి' తెలుగుజాతి రాణి, మరచిపోతున్న తెలుగు చరిత్రను చాటి చెప్పింది. దర్శకత్వం లేదా మరేదైనా నాసిరకంగా కనిపించి ఉండవచ్చు. ఆమె ఇచ్చిన సందేశం అందలేదా? మహిళా సాధికారతపై ‘రుద్రమదేవి'లో అసలు సందేశం లేదా?. నా వెనక ఎలాంటి శక్తులు లేవు. మహిళా సాధికారికతపై తీసిన సినిమాకు అవార్డు ఇవ్వకపోవడం బాధాకరం. అడిగే హక్కు అందరికీ ఉంది' అని గుణశేఖర్ చెప్పారు.