జయప్రద టు గుండు సుధారాణి: చంద్రబాబుకు 'రాజ్యసభ' షాక్లు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి రాజ్యసభ షాక్ తగులుతోంది! పార్టీలో రాజ్యసభ పదవి పొందిన పలువురు నేతలు.. ఆ తర్వాత టిడిపిని వదిలిన సందర్భాలు ఉన్నాయి. మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
తాజాగా వరంగల్ టిడిపి సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె నేడో, రేపో కారు ఎక్కనున్నారని తెలుస్తోంది. బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిశారు కూడా.
గుండు సుధారాణిలా.. గతంలోను పలువురు నేతలు రాజ్యసభ పదవి పొందిన అనంతరం పార్టీని వీడిన సందర్భాలు ఉన్నాయి. సి రామచంద్రయ్య, మోహన్ బాబు, జయప్రద, వంగా గీత, రేణుకా చౌదరి తదితరులు టిడిపిని వీడారు. ఇందులో కొందరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు బావమరిది, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అయితే, ఆయన పలు సందర్భాల్లో అధిష్టానం పైన తన అసహనం, అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆయన వారసుడి విషయంలో అసహనంతో కనిపించారు.
సి రామచంద్రయ్య ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జయప్రద రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి ఏ పార్టీలో లేరు. మోహన్ బాబు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కారణాలు ఏవైనా రాజ్యసభ సభ్యులుగా ఉన్న పలువురు చంద్రబాబుకు షాకిస్తున్నారు.