జగన్పై హత్యాయత్నం, ఐడీ కార్డ్: జోగి రమేష్ విచారణ, పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
గుంటూరు: గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన కత్తి దాడి ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడింది టీడీపీ కార్యకర్తేనని వైసీపీ నేత జోగి రమేష్ అన్నారు. దీనిపై గుంటూరు ఆరండల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు.
జగన్పై హత్యాయత్నం కేసు: జోగికి నోటిసులు, బాబుపై జగన్ పార్టీ రివర్స్ ప్లాన్
తమ ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ మంగళవారం విచారణ కోసం పోలీస్ స్టేషన్కు వచ్చారు. పోలీసులు ఆయనను చాలాసేపు విచారించారు. నిందితుడు శ్రీనివాస్ రావు టీడీపీ కార్యకర్తగా ఫేక్ ఐడీ కార్డు ఎవరో సృష్టించారని చెబుతున్నారు. ఈ టీడీపీ ఫేక్ ఐడీ కార్డు వ్యవహారంలో జోగిని పోలీసులు విచారించారు.
జోగిని విచారిస్తున్న సమయంలో ఓ వైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరండల్పేట పోలీస్ స్టేషన్కు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జోగిని అరెస్టు చేయాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అరెస్టు డిమాండుతో వారు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.