పవన్ కళ్యాణ్ త్వరలో గుంటూరుకు రాక:పార్టీ కార్యాలయం ప్రారంభించనున్న జనసేనాని
Recommended Video
గుంటూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో గుంటూరు నగరానికి విచ్చేయనున్నారు. అమరావతి రోడ్డు నుంచి ఆటోనగర్ వైపుకు వెళ్లే ఇన్నర్ రింగ్రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించేందుకే ఆయన గుంటూరు నగరానికి రానున్నట్లు తెలిసింది.
ఈ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్తో అధికారికంగా ప్రారంభోత్సవం చేయించడమే ఆలస్యం ఇక ఇక్కడ పార్టీకి సంబంధించి విస్తృతంగా కార్యకర్తల సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించాలని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.ఇప్పటికే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్నట్లు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్ రాక దృష్ట్యా ఈ కార్యక్రమానికి ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తారని భావిస్తున్నారు.
కార్పోరేట్ స్టైల్లో...భారీ భవనం
ఒకవైపు గుంటూరు నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వెళ్లే రోడ్ కు అతి సమీసంగా...మరోవైపు చూస్తే విజయవాడ నగరానికి కనెక్టవిటీ కోసం నిర్మించిన ఇన్నర్ రింగ్ రోడ్డులో జనసేన గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం సంసిద్దమైవుంది. అంతేకాదు చూడగానే ఆకట్టుకునేలా చక్కటి ఎక్స్ టీరియర్ డిజైన్ తో...అందంగా భారీగా తీర్చిదిద్దిన ఈ నాలుగు అంతస్తుల పార్టీ కార్యాలయం జనసేన పార్టీ సేవలకు ఎంతగానో ఉపయోగపడనుందని జిల్లా పార్టీ శ్రేణులు సంతోషపడుతున్నాయి.
భారీ...బహిరంగ సభ
జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు,పార్టీ కార్యకర్తలు భారీగా తరలిరావడం ఖాయం కాబట్టి...ఆ రోజున పనిలో పనిగా గుంటూరు నగరంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇందుకు వేదిక, తేదీలను ఇంకా ఖరారు చేయనప్పటికి బహిరంగ సభ అయితే ఖచ్చితంగా నిర్వహించాలని నిర్ణయించాయి.
సరైన సమయంలో...అందివచ్చింది
వచ్చే ఏడాది ప్రధమార్ధంలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో...రాష్ట్రాన్ని ఇప్పటికే పొలిటికల్ ఫీవర్ ఆవరిస్తున్న వేళ...రాజకీయ చైతన్యమున్న గుంటూరు జిల్లాలో...నవ్యాంధ్ర రాజధాని పరిధిలో...జనసేనకు గుంటూరులో చక్కటి అనువైన...కార్పోరేట్ స్టైల్ పార్టీ కార్యాలయం సమకూరటం ఆ పార్టీకి ఎంతో ప్రయోజనకారి కాబోతున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిందే తడవుగా జిల్లాలో తమ పార్టీని ఎన్నికల సమరానికి సమాయత్తం చేసే దిశలో జనసేన పార్టీ వర్గాలు ఉవ్విళ్లూరుతున్నాయి.
వరుస కార్యక్రమాలు...శిక్షణ షురూ!
గుంటూరు జిల్లాలో జనసేన కి పటిష్టమైన పార్టీ వ్యవస్థను, కేడర్ను ఏర్పాటు చేసే దిశగా ఆ పార్టీ వర్గాలు సమాయత్తమవుతున్నాయి. సెప్టెంబర్లోనే జనసేన జిల్లా, అర్బన్ జిల్లా కమిటీలను నియమించే ప్రక్రియ పూర్తవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆగష్టు నెలలో గుంటూరులో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ చింతా పార్ధసారధి, పార్టీ కమిటీలపై కసరత్తు చేస్తున్నామని, మరోనెలలో కమిటీలు ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ కమిటీల్లో బీసీలకు, మైనార్టీ వర్గాలకు, మహిళలకు, యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పేశారు. ఇక జిల్లా, అర్బన్ జిల్లా కమిటీలు, పట్టణ కమిటీలు ఎంపిక చేసే ముందు...ఔత్సాహిక నాయకులు, కార్యకర్తలకు రాష్ట్రంలోని అన్నిఅసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా వర్క్షాప్లు నిర్వహించి...వీటిలో పార్టీ సిద్దాంతాలను వివరిస్తారు. అంతేకాదు ఇక్కడ చక్కటి వాగ్ధాటి ఉన్న వారిని ఎంపిక చేసి వారికి పార్టీలో కీలక పదవులు కట్టబెట్టాలనే యోచన చేస్తున్నట్లు తెలిసింది.