గుంటూరు-గుంతకల్లు మార్గం విద్యుదీకరణ పూర్తి...త్వరలో ఎలక్ట్రిక్ రైళ్ల రాకపోకలు
గుంటూరు: గుంటూరు-గుంతకల్లు రైల్వే మార్గంలో అతి త్వరలోనే విద్యుత్ రైళ్లు నడవనున్నాయి. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిఈ శ్రీనివాస్ వెల్లడించారు. నంద్యాల సమీపంలోని దిగువమెట్ట-బొగద సొరంగం వద్ద విద్యుదీకరణ పూర్తి కావడంతో ఆదివారం పాణ్యం నుంచి దిగువమెట్ట వరకూ విద్యుత్ రైలుతో ట్రయల్ రన్ను నిర్వహించగా ఏ అవాంతరం లేకుండా విజయవంతం అయింది.
దీంతో త్వరలోనే దక్షిణ మధ్య రైల్వే భద్రతా కమిషనర్ శ్రీరామ్ కృపాల్ ఈ విద్యుత్ రైలు మార్గాన్నిపరిశీలించేందుకు విచ్చేయనున్నారు. ఈ పర్యటన అనంతరం ఆయన ఆమోద ముద్రతో ఈ నెలాఖరు లేదా మార్చి మొదటివారం నుంచి గుంటూరు-గుంతకల్ మార్గంలో పూర్తి స్థాయిలో విద్యుత్ రైళ్లు నడిచే అవకాశముంది.
గుంటూరు-గుంతకల్లు మార్గంలో అతి త్వరలోనే విద్యుత్ రైళ్లు పరుగులు పెట్టడం ఖాయమని గుంటూరు డివిజన్ సీనియర్ డీఈ శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు-గుంతకల్లు మధ్య 429 కి.మీ దూరం మేరా రైలు మార్గంలో విద్యుదీకరణ పనులను ఇటీవలే పూర్తి చేశారు. అలాగే పాణ్యం-దిగువమెట్ట మధ్య 60 కి.మీ పరిధిలో నల్లమల అడవుల గుండా సాగే రైల్వే ట్రాక్ రెండు చోట్ల సొరంగాల గుండా కొనసాగుతుంది. ఆ టన్నెల్స్ వద్ద విద్యుదీకరణ పనులు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
అయినప్పటికి రైల్వే శాఖ సిబ్బంది తీవ్రంగా కృషిచేసి క్లిష్టతరమైన ఆ పనులను విజయవంతంగా పూర్తిచేయడంతో ఇక ఎలక్ట్రిక్ రైళ్లు పరుగులు పెట్టేందుకు మార్గం సుగమం అయింది. ఆదివారం నిర్వహించిన ట్రయల్ రన్లో ఏ అవాంతరం తలెత్తకపోవడంతో విద్యుత్ రైలింజన్ నిరాటంకంగా పరుగులు పెట్టింది. దీంతో ట్రయల్ రన్ పూర్తయి రైలింజన్ దిగువమెట్ట రైల్వేస్టేషన్ చేరుకున్నవెంటనే...కష్టపడి క్లిష్టమైన పని పూర్తి చేశామన్నఆనందంతో విద్యుత్ రైలింజన్ నడిపిన అధికారులు, సిబ్బంది, సంబరాలు చేసుకున్నారు. ట్రయల్ రన్లో సీనియర్ ఎలక్ట్రికల్ డీఈ శ్రీనివాస్, డీఈఈ దినేష్రెడ్డి, లోకో పైలెట్ సురేష్, ఇన్స్పెక్టర్ కొండబాబు పాల్గొన్నారు.