గుంటూరు:పెదనందిపాడు సందర్శన కోసం అన్నాహజారేకు ఆహ్వానం
గుంటూరు:సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేకు గుంటూరు జిల్లా నుంచి ఊహించని ఆహ్వానం అందింది. ఆనాటి స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా చేపట్టిన పన్నుల నిరాకరణ ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలవడం ద్వారా గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు గ్రామం చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకుంది.
ఈ పెదనందిపాడు గ్రామాన్ని సందర్శించాలంటూ సామాజిక ఉద్యమకారుడైన అన్నా హజారేను ఈ గ్రామానికే చెందిన ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఆహ్వానించారు. ఈ మేరకు విశ్రాంత ఏఎస్పీ కాళహస్తి సత్యనారాయణ మంగళవారం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా రాలెగ సిద్ధి గ్రామం వెళ్లి అన్నాహజారేను కలిసి తమ గ్రామానికి ఆహ్వానించారు.
స్వాతంత్ర సంగ్రామంలో పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని పర్వతనేని వీరయ్యచౌదరి అనే వ్యక్తి పెదనందిపాడు నుంచే ప్రారంభించినట్లు ఆయన అన్నా హజారేకు వివరించారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, పారిశుద్ధ్య కార్యక్రమాలను తమ గ్రామంలో నేటికీ అమలు చేస్తున్నట్లు అన్నా హజారేకు వెల్లడించారు. స్వాత్రంత్ర్య పోరాట చరిత్రలో స్థానం సంపాదించిన తమ గ్రామంలో ఒక్కసారి పర్యటించాలంటూ కాళహస్తి సత్యనారాయణ అన్నాహజారేను కోరారు.