విషాదం : కరోనా అనుమానంతో ఒకరు బలి.. ఏపీ తాజా హెల్త్ బులెటిన్ విడుదల
కరోనా వైరస్పై ప్రజల్లో కొన్ని లేనిపోని అపోహలు,ఆందోళన నెలకొన్నాయి. విచ్చలవిడిగా వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తున్న మెసేజ్లు చాలామందిని భయాందోళకు గురిచేస్తున్నాయి. మరికొందరు తమకు తామే.. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో మానసికంగా కుంగిపోతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అసలేం జరిగింది..
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... కొత్తపల్లి గ్రామానికి చెందిన అక్కల వెంకటయ్య(55) ఇటీవలే హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చాడు. హైదరాబాద్లో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న వెంకటయ్య.. లాక్ డౌన్ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చాడు. అయితే ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదు. కుటుంబ సభ్యులకు కూడా దూరం పాటిస్తున్నాడు. ఇదే క్రమంలో హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి గ్రామానికి వచ్చినవారు పంచాయతీ కార్యాలయంలో పేర్లు నమోదు చేయించుకోవాలని రాత్రి దండోరా వేశారు.
గ్రామ శివారులో ఆత్మహత్య
గ్రామ పెద్దల పిలుపు మేరకు వెంకటయ్య కూడా తన పేరు నమోదు చేయించుకున్నాడు. అప్పటినుంచి మరింత ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలో శనివారం(మార్చి 28) ఉదయం గ్రామ శివారుకు వెళ్లిన వెంకటయ్య.. అక్కడినుంచి తన రెండో కుమారుడు శిలువబాబుకు ఫోన్ చేవాడు. తనకు కరోనా సోకిందేమోనన్న అనుమానం కలుగుతోందన్నాడు. తనవల్ల ఊరందరికీ వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. అలా జరగడం తనకు ఇష్టం లేదన్నాడు. గ్రామ శివారులో ఉన్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడు.వెంకటయ్య ఫోన్ పెట్టేసిన వెంటనే అతని కుమారుడు,కుటుంబ సభ్యులు అక్కడికి పరిగెత్తారు. కానీ అప్పటికే వెంకటయ్య వేప చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా బులెటిన్ విడుదల..
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులపై ప్రభుత్వం తాజా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వెల్లడించింది. 22 మందికి నెగెటివ్గా తేలినట్టు తెలిపింది. మరో 37 కేసుల్లో ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొంది. విదేశాల నుంచి వచ్చిన 29,264 మందిపై ప్రత్యేక నిఘా ఉంచినట్టు తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన 149 మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. క్వారంటైన్ కోసం 23,479 పడకలను ఇప్పటికే సిద్ధం చేసినట్టు స్పష్టం చేసింది.