రష్యా రాయబార కార్యాలయాన్నే మోసగించిన ఘనుడు...గుంటూరులో అరెస్ట్
గుంటూరు:న్యూ ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయాన్నే మోసగించి రూ.28 లక్షలు కొట్టేశాడో ఘనుడు. ఎంబసీలో రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసే కాంట్రాక్టును ఆన్లైన్ ద్వారా చేజిక్కించుకున్న గుంటూరు జిల్లాకు చెందిన కోరే రంగబాబు...ముందుగానే డబ్బులు తీసుకుని ఆ తరువాత పత్తాలేకుండా పోయాడు.
దీంతో రష్యన్ రాయబార కార్యాలయం సెక్రటరీ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ పోలీసులు గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో మకాం వేసిన రంగబాబును గుర్తించి పట్టుకున్నారు. చురుగ్గా విచారణ జరిపి నిందితుడిని పట్టుకొని తమ సొత్తు దక్కేలా చేసిన తెలంగాణా పోలీసులను రష్యా ఎంబసీ అధికారులు అభినందించారు. వివరాల్లోకి వెళితే...
గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం...న్యూఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయంలో ఎస్ఐఆర్ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ఏర్పాటు కోసం 2016 మే నెలలో ఆన్లైన్ టెండర్లు పిలిచారు. హైదరాబాద్ సరూర్నగర్లోని కేఆర్బీ జీఈఐఓ సర్వీసెస్ అనే సంస్థకు సీఈఓగా వ్యవరిస్తున్న గుంటూరు జిల్లా వాసి కోరే రంగబాబు ఈ రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా టెండరు దాఖలు చేసి 42,500 అమెరికన్ డాలర్లు(రూ.28 లక్షలు)కు కోట్ చేసి పనులు దక్కించుకున్నారు.
ఆ తర్వాత సదరు పని నిమిత్తం మొత్తం డబ్బులు ముందే ఇస్తేనే పనిచేయగలనని చెప్పాడు. దీంతో రష్యన్ ఫెడరేషన్ రాయబార కార్యాలయం సదరు మొత్తాన్ని రంగబాబు అకౌంట్లోకి బదిలీ చేసింది. ఆ తరువాత రంగబాబు పనులు ప్రారంభించపోగా జీఎస్టీ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరికొంత డబ్బు కావాలని కోరాడు. కానీ అందుకు రష్యన్ అధికారులు అంగీకరించలేదు. ముందు అనుకున్న విధంగానే పనులు పూర్తి చేయాలని చెప్పారు. దీంతో అతను సరేనని చెప్పి ఆ తరువాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
రంగబాబు ను సంప్రదించేందుకు రష్యన్ ఎంబసీ అధికారులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో ఎంబసీ కార్యాలయం సెక్రెటరీ ఇగోర్ బోల్డిరేవ్ 2017 సెప్టెంబర్ 29న తెలంగాణ డీజీపీకి రంగబాబుపై ఫిర్యాదు చేశారు. ఈ ఛీటింగ్ పై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ హుడా కాలనీలో రంగబాబు ఆఫీసు అడ్రస్ గుర్తించి అక్కడకు వెళ్లగా ఆఫీస్ ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆ తరువాత రంగబాబు ఆచూకీ కోసం తీవ్రంగా కృషిచేయగా చివరకు గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో మకాం వేసినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.
ఆ తరువాత రంగబాబు పోలీసులను...రష్యా ఎంబసీ అధికారులను బ్రతిమలాడుకొని వారి డబ్బు తిరిగి అకౌంట్లో జమ చేశాడు. పోయిన డబ్బు తిరిగి జమ కావడంతో రష్యా ఎంబసీ అధికారులు కోర్టులో కేసు ఉపసంహరించుకోనున్నట్లు తెలిసింది. రంగబాబు ఇదే విధంగా పలువురిని మోసగించి ముందే డబ్బు తీసుకొని...ఆ తరువాత గొడవలు కేసులైతే తిరిగి డబ్బు జమ చేయడం...లేదంటే స్వాహా చేయడం చేస్తాడని తెలిసింది. దేశ ప్రతిష్టకు మచ్చతెచ్చేలా రంగబాబు వ్యవహరించాడని కేసును దర్యాప్తు చేసిన డీసీపీ వెంకటేశ్వర్ రావు అన్నారు. రంగబాబును అరెస్ట్ చేసి కేసు చేధించిన సీఐ రంగస్వామిలను సీపీ అభినందించారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమంలో రష్యన్ ఫెడరేషన్ రాయబారి కార్యాలయం సెక్రెటరీ ఇగోర్ బోల్డిరేవ్ తెలంగాణా పోలీసులను అభినందించారు.