విదేశీయులను బెదిరించి పైసావసూల్; గుంటూరు పోలీసుల నిర్వాకం...పరువు పోయింది...
గుంటూరు: పోయే...పరువు పోయే...కాసుల కోసం కొందరు గుంటూరు పోలీసుల కక్కుర్తి ఇంటర్నేషనల్ లెవల్లో మన పరువు తీసి తలవంపులు తెచ్చిపెట్టాయి. లోకల్ దందాలకి అలవాటు పడ్డ కొందరు ఖాకీలు అదే స్టయిల్ ను ఫారినర్ల మీద ప్రయోగించి...బెదిరించి...భయపెట్టి...డబ్బులు వసూలు చేసుకున్నారు...అలా ఉత్తిపుణ్యానికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన ఆ విదేశీయులు తమ తమ దేశాలకు వెళ్లాక వాళ్ల దేశాల్లో ఎంబసీలో ఫిర్యాదు చేశారు...వారు మన రాయబార కార్యాలయానికి కంప్లయింట్ ఇవ్వడంతో ఈ విషయం డిజిపి దృష్టికి వచ్చింది.
గుంటూరులో తమ స్నేహితుడి పెళ్లికి వచ్చేసిన వివిధ దేశాల ఫారినర్లు ఇక్కడి పోలీసుల తీరుతో బెంబేలెత్తారు. అన్ని అనుమతులు సరిగ్గానే ఉన్నా ఏదో ఒక వంక చూపించి పైసావసూల్ చేసే కొందరు పోలీసులు, ఇలా విదేశీయులు పెద్ద సంఖ్యలో ఒక పెళ్లికి వచ్చారన్న విషయం తెలిసింది. అంతే క్షణాల్లో అక్కడ వాలిపోయారు...ఒక్కసారే ఒకేచోట ఇంతమంది ఒకే చోట ఎందుకు చేరారు, మీ పాస్ పోర్టులు చూపించండి, అసలెందుకొచ్చారంటూ రకరకాల ప్రశ్నలతో హడలెత్తించి, వాళ్లందరిని వరుసగా నిలబెట్టి ఫోటోలు తీసి భయపెట్టి చివరకు డబ్బులు వసూలు చేశారని అంటున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం... గుంటూరు జిల్లాకు చెందిన తమ స్నేహితుడి కోరిక మేరకు అమెరికా, ఐర్లాండ్ తదితర దేశాలకు చెందిన సుమారు 20 మంది పెళ్లి ఫంక్షన్ కోసమని ఇక్కడకు వచ్చారు...మన దేశంలోకి ప్రవేశించిన విదేశీయుల వివరాల సేకరణ, పాస్పోర్టు తనిఖీ, అనుమతుల పరిశీలనకు ప్రత్యేక పోలీసు విభాగం ఒకటి ఏర్పాటైంది...అలా సమాచారం అందుకున్న కొందరు పోలీసులు, స్నేహితుడి వేడుకను విదేశీయులు తిలకిస్తున్న సమయంలో అక్కడకు చేరుకున్నారు. వారిని వివిధ ప్రశ్నలతో వేధించి, బెదిరించి...సరైన అనుమతులు లేవంటూ డబ్బులు వసూళ్లు చేశారు. ఈ ఘటనతో తీవ్ర మానసిక క్షోభ అనుభవించిన విదేశీయులు తమ తమ దేశాలకు తిరిగి వెళ్లిన తర్వాత గుంటూరు పోలీసులు ప్రవర్తించిన తీరు గురించి వివరిస్తూ అక్కడి ఎంబసీల్లో కంప్లయింట్ ఇచ్చారు.
దీంతో ఆయా ఎంబసీలవారు మన ఇండియన్ ఎంబసీలో ఫిర్యాదు చేయగా విషయాన్ని వారు ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో విదేశీయులపట్ల అంత విపరీత ధోరణితో ప్రవర్తించిన పోలీసులు ఎవరంటూ డిజిపి ఆగ్రహం వ్యక్తం చేసి, ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై పూర్తి విచారణ జరపాలని ఆదేశించినట్లు సమాచారం. డీజీపీ ఆదేశాలతో అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది...ఆ రోజు విదేశీయుల వద్దకు వెళ్లింది ఎవరు?...అక్కడ ఎలా ప్రవర్తించారు?...వారిని ఏమని బెదిరించారనే కోణాల్లో దర్యాప్తు బృందం విచారణ జరుగుతోంది. ప్రాథమిక దర్యాప్తులో కొందరు పోలీసులు విదేశీయుల పట్ల దరుసుగా ప్రవర్తించారనే విషయం వాస్తవమేనని తేలినట్లు సమాచారం. మరింత లోతుగా దర్యాప్తు జరిపి సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.