coronavirus:మందుల కోసం వెళ్లిన యువకుడి మృతి కేసులో చర్యలు, సత్తెనపల్లి ఎస్సై సస్పెండ్..
సత్తెనపల్లిలో మందుల కోసం వచ్చిన యువకుడు మహ్మద్ గౌస్ చనిపోవడం కలకలం రేపింది. పోలీసుల తీరును కొందరు తప్పుపడుతున్నారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. సత్తెనపల్లి ఎస్సై రమేశ్పై సస్పెన్షన్ వేటు వేశారు. జరిగిన ఘటనను గుంటూరు రేంజ్ ఐజీ వివరించారు. పోలీసులు గౌస్పై దాడిచేయలేదని స్పష్టంచేశారు. మరోవైపు మహ్మద్ గౌస్ మృతదేహాం తరలించే క్రమంలో ఆగ్రహానికి గురైన బంధువులు సీఐపై దాడి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
దాడి చేయలేదు..
వైరస్ కేసులు పెరుగుతున్నందున ఆంక్షలు మరింత కఠినతరం చేశామని ఐజీ పేర్కొన్నారు. ఉదయం 9 తర్వాత ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. సోమవారం నుంచి ఏ మండలానికి చెందినవారు అక్కడే ఉండాలని ఆదేశాలు జారీచేశామని గుర్తుచేశారు. అయితే మందుల కోసం వచ్చిన మహ్మద్ గౌస్ను పోలీసులు ఎక్కడికి వెళ్తున్నావని మాత్రమే అడిగారని తెలిపారు. అతనిపై దాడి చేయలేదని క్లారిటీ ఇచ్చారు. పోలీసులు అడగడంతో అతను భయంతో కుప్పకూలిపోయాడని వివరించారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడని పేర్కొన్నారు.
గుండెపోటుతోనే..?
గౌస్ ఆరోగ్యం బాగోలేదు అని ఐజీ తెలిపారు. అతనికి గుండె సంబంధిత వ్యాధి ఉంది.. అని పోలీసులు ఆపిసరికి ఒత్తిడికి లోనయ్యారని చెప్పారు. గుండెపోటు రావడంతోనే చనిపోయారే తప్ప.. దాడిచేయడంతో కాదు అని పేర్కొన్నారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు ఇంట్లో ఉండాలని కోరుతున్నామని.. తప్ప దాడులు చేయడం లేదన్నారు. గౌస్ మృతితో అతని బంధువులు ఆందోళన వ్యక్తంచేశారు. మృతదేహంతో పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. అయితే అక్కడే ఉన్న సీఐపై దాడి చేయడం కలకలం రేపింది.
Recommended Video
మందులు కంపల్సరీ..
వాస్తవానికి గౌస్ పరిస్థితి బాగోలేదు. మందులు వేసుకుంటే తప్ప బతకని పరిస్థితి. అందుకే స్వయంగా అతను వచ్చాడని కుటుంబసభ్యులు చెప్తున్నారు. మండలం దాటి రావొద్దనే విషయం తమకు తెలియదని చెప్పారు. కానీ పోలీసులు దాడిచేయడంతోనే గౌస్ చనిపోయారని వారు ఆరోపిస్తున్నారు. ఐజీ మాత్రం గుండెపోటుతోనే చనిపోయాడని తెలిపారు. దీంతో ఏం జరిగిందనే విషయం పోస్టుమార్టం రిపోర్ట్తో వెలుగుచూసే అవకాశం ఉంది.