దీపావళి : బాణసంచా కాల్చేవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే...
కరోనా లేకపోయి ఉంటే... ఎప్పటిలాగే ఈ దీపావళికి కూడా దేశమంతా బాణసంచా పేలుళ్లతో దద్దరిల్లేది. వాయుకాలుష్యంతో కరోనా పేషెంట్ల ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉండటంతో... కొన్ని రాష్ట్రాలు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక ఆంక్షలు విధించాయి. ఏపీ ప్రభుత్వం మధ్యే మార్గంగా.. కేవలం రెండు గంటలు మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ దీపావళి పండుగపై ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించారు. ప్రతీ ఒక్కరు వీటిని పాటించాలని చెప్పారు.
బాణసంచా కాల్చేవారు ఈ జాగ్రత్తలు పాటించాలి...
ప్రభుత్వ లైసెన్స్ ఉన్నవారి వద్ద మాత్రమే బాణసంచా కొనుగోలు చేయాలి.
బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చేటప్పుడు... ఎవరికీ ఎలాంటి సమస్యలు,ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడాలి.
గాజు సీసాలు లేదా ఇతర లోహపు డబ్బాల్లో బాణసంచాను కాల్చరాదు.
చేతులకు శానిటైజర్ రాసుకుని దీపాలు వెలిగించడం,టపాసులు కాల్చడం చేయరాదు. అలా చేస్తే చేతులు కాలే ప్రమాదం ఉంటుంది.
వృద్దులు,అనారోగ్యంతో బాధపడుతున్నవారు,చిన్నపిల్లలు ఉన్నచోట భారీ శబ్దాలు వచ్చే టపాసులను కాల్చరాదు.
బాణసంచా పేలకపోతే.. మళ్లీ దాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలించడం చేయవద్దు. దూరం నుంచి దానిపై నీళ్లు పోసి పేలకుండా చేయాలి.
ముందు జాగ్రత్తగా బకెట్లలో నీటిని,ప్రథమ చికిత్స సామాగ్రిని సిద్దంగా ఉంచుకోవాలి.
శబ్ద కాలుష్యం,వాయు కాలుష్యానికి తావు లేకుండా కేవలం గ్రీన్ కాకర్స్ మాత్రమే ఉపయోగించాలి.
ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు బాణంసంచాకు దూరంగా ఉండాలి.
దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరించదన్ కూడా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి యొక్క దైవిక కాంతి అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని అందించాలని ఆకాంక్షించారు. కరోనా లాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు శాంతి, స్నేహం, మత సామరస్యాన్ని నింపిన సమాజాన్ని నిర్మించడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు.