ఎన్ఐటీలో సీటు: ఫీజు కట్టే స్థోమత లేదు, ఆదుకోండంటూ వేడుకుంటున్నాడు
గుంటూరు: నిరుపేద కుటుంబంలో పుట్టినా చదువులో రాణించాడు. తాజాగా నిర్వహించిన గేట్ ఎగ్జామ్లో 6124 ర్యాంకు తెచ్చుకుని ఎన్ఐటీలో ఎంటెక్ (సివిల్ ఇంజనీరింగ్) సీటు సంపాదించాడు. కానీ... కోర్సులో చేరేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. దాతలెవరైనా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన ముక్కంటి వీరబ్రహ్మం అనే యువకుడికి గేట్ ర్యాంకు ఆధారంగా మహారాష్ట్రలోని నాగ్పూర్ ఎన్ఐటీలో ఎంటెక్ సీటు లభించింది. జులై 23 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. నాలుగు సెమిస్టర్లకు(రెండేళ్లకు) గాను కోర్సు ఫీజు రూ. 3.2 లక్షలు అవుతుంది.
తొలుత కోర్సులో చేరేందుకు రూ. 80వేల డీడీని ఇస్తేనే వీరబ్రహ్మంను కాలేజీలో చేర్చుకుంటారు. నిరుపేదకుటుంబంలో పుట్టడం వల్ల వీరబ్రహ్మం ఆర్ధిక పరిస్ధితి మరింత దయనీయంగా ఉంది. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న వీరబ్రహ్మం తండ్రి కోటేశ్వరరావుకు ఫీజు కట్టే స్థోమత లేదు.
దీంతో ఎవరైనా దాతులు సహకరిస్తే, తన ఎంటెక్ను పూర్తి చేస్తానని అంటున్నాడు. ఈ సరస్వతీ పుత్రుడికి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే నరసరావు పేట ప్రకాష్ నగర్ ఎస్బీఐ ఏడీబీ బ్రాంచ్ ఖాతా నెంబరు: 20217665676లో డబ్బు జమ చేయాలని వేడుకుంటున్నాడు.
దాతలు 96662 42143కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.