గుంటూరు టీడీపీలో వెలుగు చూసిన విభేదాలు...పర్యవసానాలపై పార్టీ కార్యకర్తల్లో ఆందోళన
గుంటూరు:గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీలో చోటుచేసుకొన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇటీవలివరకు మిర్చియార్డ్ ఛైర్మన్ గా పనిచేసిన మన్నవ సుబ్బారావుకు జరిగిన ఆత్మీయ సన్మానం వేదికగా ఈ విభేదాలు వెలుగులోకి వచ్చాయి.
మిర్చియార్డ్ ఛైర్మన్ గా మరో సీనియర్ నేతకు అవకాశం కల్పించే ఉద్దేశంతో మన్నవ సుబ్బారావుకు పదవి పొడిగింపు చేయక పోవడంతో ఆయన తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిర్చియార్డ్ ఛైర్మన్ గా పనిచేసిన ఆదివారం ఆత్మీయ సన్మానం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, వీవీవీ చౌదరి తదితరులు విచ్చేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి గైర్హాజరు కావడం, హాజరైన నేతలు సైతం పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకోవడం పార్టీ శ్రేణుల్లో కలవరం రేపింది.
మన్నవ సుబ్బారావు ఆత్మీయ సన్మానం కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డికి అసలు ఆహ్వానమే అందలేదట. ఆయన ఈ కార్యక్రమానికి హాజరకపోవడం ద్వారా ఆ విషయం వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. కారణం గుంటూరు మిర్చియార్డ్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోనే ఉండటమే.
అంతేకాకుండా గతంలో మిర్చియార్డ్ ఛైర్మన్ పదవిని మన్నవకు కట్టబెట్టడాన్నిమోదుగుల వేణుగోపాల రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు...పార్టీలో సుదీర్ఘకాలంగా ఉంటూ కష్టకాలంలో అండగా నిలిచిన వెన్నా సాంబశివారెడ్డికే ఆ పదవి కట్టబెట్టాలని స్థానిక ఎమ్మెల్యే హోదాలో గట్టిగా పట్టుబట్టారు. అయితే ముఖ్యమంత్రితో వ్యక్తిగతంగా ఉన్న పరిచయం ద్వారా మన్నవకే ఆ పదవి దక్కింది. దీంతో ఆ వివాదం వీరి మధ్య అంతరం మరింత పెరగడానికి కారణమైంది.
ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే అయినా మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని పిలవలేదేమోనని పార్టీ శ్రేణులు భావించాయి. అయినా అలా చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే అది కూడా కారణం కాదని, అసలు కారణం ఏమిటనేది తరువాత అర్థమయింది. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు మన్నవ సుబ్బారావుకే కేటాయించాలని సన్మానం సందర్భంగా సభలో ఆయన మద్దతుదారులు ప్రతిపాదన చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అభ్యర్థుల ప్రతిపాదనలకు ఇది వేదిక కాదంటూ వీవీవీ చౌదరి స్పష్టం చేశారు.
అనంతరం మాట్లాడిన మంత్రి పుల్లారావు సీఎం పదవి ఇస్తే తప్ప నేతలకు సంతృప్తి లేదంటూ మన్నవ సుబ్బారావును ఉద్దేశించి చురకలు సంధించారు. దీంతో పార్టీలో నివురుగప్పిన నిప్పులా రగులుతున్న అసంతృప్తి జ్వాలలు మరోసారి భగ్గుమని వెలుగులోకి వచ్చినట్లయింది. ఈ వ్యవహారం తెలిసాక స్థానిక ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారోనని టిడిపి కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తం అయింది.