ఏపీ రాజధాని: 'గుంటూరు-విజయవాడ ఏపీకి సెంటర్'
హైదరాబాద్: అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంటుందనే ఉద్దేశంతోనే కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీని కోరామని మంత్రి పి నారాయణ చెప్పారు. శ్రీకాకుళం - గుంటూరు మధ్య దూరం 650 కిలోమీటర్లు, అనంతపూర్-గుంటూరు మధ్య 550 కిలోమీటర్లు ఉందన్నారు.
ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఏ రకంగా చూసినా ఆ ప్రాంతం సెంటర్ అవుతుందని భావించామన్నారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కమిటీ శనివారం సమావేశమవుతుందని చెప్పారు.
శివరామకృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుస్తుందన్నారు. రాజధానికి అనువైన ప్రదేశం ఎంపికకు కేంద్రం శివరామకృష్ణన్ కమిటీకి కొన్ని మార్గదర్శకాలను సూచించిందని తెలిపారు.
రాజధాని నిర్మాణానికి నీరు, రైలు, రోడ్డు, ఎయిర్పోర్టు, భూమి అనువుగా ఉండే ప్రాంతంగా ఉండాలని, రాజ్ భవన్, సచివాలయం, హైకోర్టు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మించేందుకు అనువైన భూమిని ఎంపిక చేసుకోవాలని తెలిపారన్నారు. సామాజిక జీవనానికి అనువుగా ఉండే ప్రాంతంగా ఉండాలని కమిటీకి కేంద్రం సూచించిందని తెలిపారు. అదే కోణంలో పరిశీలించిన తమ కమిటీ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసిందన్నారు.