షరా మామూలే...భర్తను భార్యే ప్రియుడితో చంపించింది:మరో కేసులో...ఆశ్చర్యం...ఏం జరిగిందంటే?
గుంటూరు:నగర శివార్లులోని వెంగళాయపాలెం గ్రామం పూలెనగర్కి చెందిన మిర్చియార్డు కూలీ శివుడు నాయక్ హత్య కేసును గుంటూరు రూరల్ పోలీసులు ఛేదించారు.
నల్లపాడు పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్జోన్ రూరల్ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి, సీఐ బాలమురళీకృష్ణ కేసుకు సంబంధించిన వివరాలు విలేకరులకు వెల్లడించారు. ప్రియుడితో కామకలాపాలకు భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్యే కట్టుకున్న వాడిని దారుణంగా హత్య చేయించిన వైనం ఈ హత్య ద్వారా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే...
వెంగళాయపాలెం గ్రామానికి చెందిన శివుడునాయక్ మిర్చియార్డులో కూలీగా పనిచేస్తుంటాడు. అతనికి భార్య రమావత్ సరస్వతిబాయి, ఇద్దరు పిల్లలున్నారు. చదువుల నిమిత్తం పిల్లలె నగరంలోని హాస్టల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో సరస్వతి బాయికి వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి చెందిన ఉప్పుతూళ్ల సత్యనారాయణతో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. సత్యనారాయణ తరుచూ భార్యతో పాటు తన ఇంట్లో కనిపిస్తుండటంతో శివుడు నాయక్ అతడిని మా ఇంటికి ఎందుకు వస్తున్నావు...ఇతడు మన ఇంట్లో ఎందుకు ఉంటున్నాడని భార్యను పలుమార్లు నిలదీస్తున్నాడు.
దీంతో ఆమె గతంలో తాము అతని వద్ద అప్పు తీసుకున్నామని...అతడు తనకు తమ్ముడవుతాడని చెప్పేది. అయితే ఇదే విషయమై భార్యాభర్తల మధ్య పలుమార్లు వివాదం జరుగుతుండేది. ఈ క్రమంలో సత్యనారాయణ, సరస్వతిబాయి తమ వివాహేతర సంబంధానికి శివుడునాయక్ అడ్డుగా ఉన్నాడని, అతడిని చంపి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ఒక పథకం ప్రకారం సత్యనారాయణ శివుడునాయక్తో కలిసి ఈ నెల 3వ తేదీన మద్యం తాగుదామని చెప్పి అతని బండిపై బయటకు తీసుకువచ్చాడు.
ఆ తరువాత మద్యం షాపునకు వెళ్లి ఫుల్లగా మద్యం సేవించి మరో రెండు బీర్లు, క్వార్టర్ మందును తీసుకుని ఆ దుకాణం నుంచి బయటకు వచ్చారు. ఇంటికి వెళితే వివాదం అవుతుందని, మధ్యలోనే తాగి వెళదామని చెప్పి సత్యనారాయణ పూలేనగర్ సమీపంలోని ప్లాట్లలోకి తీసుకెళ్లాడు. అక్కడ తాగేందుకు కూర్చున్న శివుడునాయక్పై ముందుగా ప్లాను ప్రకారం వెంటతెచ్చుకున్న రాడ్డుతో దాడి చేసి తలపై బలంగా మోదాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే శివుడు మృతి చెందాడు. అనంతరం తాను హత్య చేసినట్లు ఎవ్వరూ గుర్తించకుండా ద్విచక్రవాహనానికి రక్తాన్ని అంటించి శివుడునాయక్ పనిచేసే మిర్చి యార్డు సమీపంలోని గోడౌన్ వద్ద ద్విచక్రవాహనాన్ని నిలిపి పారిపోయాడు.
పనిపూర్తయిందోలేదో తెలియని సరస్వతిబాయి తన భర్త ఇంటికి రాలేదని చెప్పి, అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో ఇంటి వద్దనున్న మరొకరి సెల్ను తీసుకుని ముద్దాయి సత్యనారాయణకు ఫోన్ చేసి విషయాన్ని తెలుసుకుంది. హత్య చేశాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లి తన భర్త అర్ధరాత్రయినా ఇంటికి రాలేదని చుట్టుపక్కల వారికి చెప్పింది. ఇదిలా ఉండగా 4వ తేదీన ఉదయం తెల్లవారు జామున పూలే నగర్ సమీపంలో ప్లాట్లలో శవం ఉందని స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకుని తన భర్తను ఎవరో హత్యచేశారని బోరున విలపించింది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. భార్య ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత భార్యను అనుమానించిన పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయట పడింది. సరస్వతిబాయితోపాటు సత్యనారాయణను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, తామే ప్రణాళిక ప్రకారమే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో శనివారం హాజరు పరిచారు.
మరో కేసులో కడప హనుమాన్నగర్కు చెందిన వివాహిత పోసా స్వాతి అదృశ్యం ఆమె తండ్రి జగదీశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోసా స్వాతికి మూడు నెలల క్రితం బుక్కాయపల్లెకు చెందిన బైక్ మెకానిక్ వినోద్కుమార్తో వివాహమైంది. ఈనెల 11న స్వాతి భర్త వినోద్కుమార్తో కలిసి ఆమె పుట్టింటికి వచ్చింది. అయితే నిద్రపోయేందుకు ఇంట్లో వసతి లేకపోవడంతో ఆ రోజు రాత్రి పట్టణంలోని ఓ లాడ్జిలో బస చేశారు. 12 ఉదయాన్నే భర్త వినోద్కుమార్ స్నానం చేసి వచ్చేసరికి భార్య స్వాతి కన్పించలేదు. దీంతో ఈ విషయాన్ని మామ జగదీశ్వరరావు తెలియజేశాడు. దీంతో జగదీశ్వరరావు శనివారం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణయాదవ్ తెలిపారు.