కోల్కత్తాలో గుంటూరు జిల్లాకు చెందిన యువ క్రికెటర్ ఆత్మహత్య
అమరావతి: గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువ క్రికెటర్ కోల్కత్తాలోని ఓ ప్రైవేట్ అకాడమీలో శిక్షణ పొందుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని ఉప్పల పాడు గ్రామానికి చెందిన ఎస్. ఫణీంద్ర (23)కు క్రికెట్ అంటే ఆసక్తి.
గుంటూరులోని జేకెసీ కాలేజీలో బీకాం పూర్తిచేశాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఆసక్తి ఉండటంతో చదువుకునే రోజుల్లో నగరంలోని క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. తన చదువు పూర్తైన తర్వాత కోల్కత్తాలోని ఓ ప్రైవేట్ అకాడమీలో శిక్షణ పొందేందుకు వెళ్లాడు.
అయితే ఏమందో తెలియదు ఫణీంద్ర అకాడమీలోని తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోల్కత్తా పోలీసుల సమాచారం మేరకు వెల్దుర్తి మండల సబ్ ఇన్స్పెక్టర్ ఎమ్. రవికృష్ణ ఫణీంద్ర ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఉప్పలపాడులోని మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశారు.
ఈ సంఘటనతో మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుడితో మాట్లాడి రెండు రోజులు అయిందని మృతుడి తల్లి ఎంతో ఆవేదన చెందారు. కోల్కత్తాలో శిక్షణ పొందుతున్న క్రికెట్ అకాడమీ తరుపున తమ కుమారుడు పలు టోర్నమెంట్స్లో పాల్గొన్నట్లు చెప్పారు.
ఇటీవలే జార్ఖండ్ రాజధాని రాంచీలో క్రికెట్ టోర్నమెంట్ ఆడిన ఫణీంద్ర, ఆ టోర్నమెంట్ ముగిసిన అనంతరం జూన్ 7వ తేదీన కోల్కత్తాకు వచ్చాడని పోలీసులు తెలిపారు. తమ కుమారుడు ఓ మంచి క్రికెటర్ అవుతాడని అనకుంటే ఇలా అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని చనిపోతాడని తాము ఊహించలేదని ఆ తల్లి కన్నీరుమున్నీరయ్యారు.
అయితే ఫణీంద్ర ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదని కోల్కత్తా పోలీసులు వివరించారు. ఫణీంద్ర మృతదేహాన్ని స్వగ్రామమైన ఉప్పలపాడుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.