అవినీతి వివరాలతో ప్లెక్సీ...కరప్షన్ పై యువత వినూత్న పోరు:గుంటూరు జిల్లాలో విచిత్రం
గుంటూరు:గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఉప్పూడి పంచాయతీలో అవినీతిపై అక్కడి యువత వినూత్న పద్దతిలో పోరాటానికి శ్రీకారం చుట్టారు. 2013 నుంచి 2018 వరకూ ఈ పంచాయతీకి వచ్చిన నిధులు, వాటి ఖర్చుల వివరాలను ఒక ఫ్లెక్సీపై ముద్రించి ప్రధాన కూడలిలో పెట్టారు.
ఇందులో వినూత్నం ఏముంది? ...అనుకుంటున్నారా?...ఆ ఫ్లెక్సీలో అవినీతి లెక్కల గురించి కూడా సమగ్రంగా ఉన్నాయి. అంతేకాదు అవే వివరాలు ఇంటింటికి కరపత్రం ద్వారా పంపిణీ చేసి గ్రామ ప్రజల్లో అవగాహన తీసుకువస్తామని వారు చెబుతున్నారు. అవినీతిపై ఈ వినూత్న పోరును ఎంచుకున్న యువత ఈ ఫ్లెక్సీపై అంబేద్కర్, భగత్సింగ్ ఫోటోలను ఏర్పాటు చేని తమ పోరాటానికి వారే స్ఫూర్తి అని చాటుతున్నారు.
అయితే ఈ కరప్షన్ డిటైల్స్ ప్లెక్సీ కి ప్రజల నుంచి యువత ఊహించిన దానికంటే భారీ స్పందన లభించింది. ఈ ఫ్లెక్సీ మీద ఈ అవినీతి చిట్టాను స్థానికులు ఆసక్తిగా పరిశీలించి ఆయా వివరాల గురించి చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఈ ప్లెక్సీ గురించి తెలుసుకొని దీన్ని చూసేందుకు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు కూడా తరలివస్తుండటం మరో విశేషం. దీని ద్వారా తాము ఊహించిన దానికంటే ఎక్కువే చైతన్యం జనాల నుంచి నుంచి వచ్చిందని యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.