30 కేసుల్లో ముద్దాయివి, మీ నేర చరిత్ర ఎవరికి తెలియదు?: కోడెలపై వైసీపీ నేతలు
గుంటూరు: తుని ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు జీవితమంతా నేరమయమని గుంటూరు వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గుంటూరు జిల్లాలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్ మహమ్మద్ ముస్తఫా, కావటి మనోహర్నాయుడు, కొత్త చిన్నపరెడ్డి మాట్లాడారు.
ఈ సందర్భంగా 1991లో నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం వద్ద కాల్పులకు స్పీకర్ కోడెల శివప్రసాదరావే కారణమని అన్నారు. 1999లో కోడెల ఇంట్లో బాంబులు పేలి నలుగురు మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు.
అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంతో లాలూచీ పడి కేసును పక్కదారి పట్టించి, క్లీన్ చిట్ వచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న కోడెల శివప్రసాదరావు 30 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని వారు ఆరోపించారు.
మరోవైపు నరసరావు పేట నియోజకవర్గంలో జరిగే శంకుస్థాపన కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేకాదు మాజీ మంత్రి హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో కోడెలను నిందితుడిగా పేర్కొన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు.
స్పీకర్ కోడెల అద్దం ముందు కూర్చుంటే ఆయనతో పాటు అవినీతికి పాల్పడుతున్న కూతురు, కుమారుడు కూడా కనిపిస్తారంటూ ఎద్దేవా చేశారు. నరసరావుపేట, సతైనపల్లి నియోజకవర్గాల్లో స్వచ్ఛంద సంస్థ ద్వారా రిఫరెండమ్ నిర్వహిస్తే ఎవరు అవినీతిపరులో, ఎవరిది నేరమయ జీవితమో ప్రజలే తెలియజేస్తారన్నారు.
కాపు గర్జన సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై ఎలాంటి విచారణ నిర్వహించకుండానే ముఖ్యమంత్రి, మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్పై ఆరోపణలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత వైయస్ జగన్కు మైక్ ఇవ్వకుండా అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరిలకు అవకాశం ఇస్తున్న స్పీకర్ వ్యవహరాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
తాజాగా నరసరావుపేట, రొంపిచర్ల ఎంపిపిలకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ సభా సంప్రదాయాలు పాటిస్తున్నానని చెప్పుకోవటం మీకే చెల్లిందంటూ స్పీకర్ కోడెల వైఖరిని దుయ్యబట్టారు.