సుష్మాస్వరాజ్ వల్లే వచ్చింది, మోడీ-షాలే అడ్డుకుంటున్నారు: గల్లా జయదేవ్ షాకింగ్ కామెంట్స్
గుంటూరు: కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ పైన గుంటూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన మండిపడ్డారు.
ఏవీకి నామినేటెడ్ పోస్ట్: ఇస్తే దేనికైనా రెడీ.. అఖిల సంకేతాలు? అధిష్టానం అసహనం
గురువారం గుంటూరులో రీజినల్ పాస్పోర్టు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్ సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను గుంటూరులో పాస్ పోర్టు కేంద్రం ఏర్పాటు కోసం లేఖ రాయగానే సుష్మా స్వరాజ్ స్పందించారన్నారు.
కేంద్రమంత్రులు సిద్ధంగా ఉన్నారు
కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రత్యేక శ్రద్ధ చూపించడం వల్లే పాస్పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేయగలిగామని గల్లా జయదేవ్ వెల్లడించారు. సుష్మాలాగే చాలామంది కేంద్రమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
మోడీ, అమిత్ షాలు అడ్డుకుంటున్నారు
కేంద్రమంత్రులు ఏపీకి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు అడ్డుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరి వైఖరి కారణంగా ఏపీకి అన్యాయం జరుగుతోందన్నారు. గుంటూరులో త్వరగా పాస్పోర్ట్ ఏర్పాటులో సుష్మా చూపిన చొరవ ఎంతో ఉందని చెప్పారు.
ఇదివరకు చాలా సమయం తీసుకునేది
గతంలో పాస్పోర్టు రావాలంటే నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని గల్లా జయదేవ్ అన్నారు. ఇప్పుడు కొద్ది రోజుల్లోనే చేతికి వస్తోందన్నారు. హైదరాబాదుకు లేదా విశాఖపట్నం వెళ్లవలసి వచ్చేదని, దాంతో ఎక్కువ సమయం తీసుకునేదని చెప్పారు. ఇప్పుడు గుంటూరులోనే ఏర్పాటు చేయడం వల్ల జిల్లా, చుట్టుపక్కల జిల్లా వారికి ఉపయోగపడుతుందన్నారు.
టీడీపీ వర్సెస్ బీజేపీ
కాగా, 2014 ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కలిసి ఏపీలో పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. అయితే, ఇటీవల ప్రత్యేక హోదా, విభజన హామీల కారణంతో ఆ పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. హోదాపై చంద్రబాబు పలుమార్లు మాట మార్చారని బీజేపీ అంటే, హామీలు నెరవేర్చాల్సిందేనని టీడీపీ అంటోంది.