Chaganti Koteswara Rao: వివాదంలో చిక్కుకున్న చాగంటి కోటేశ్వరరావు
Chaganti Koteswara Rao: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు గురజాడ అప్పారావు పురస్కారం ప్రదానం చేయాలని భావించడమే ఇందుకు కారణం. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది గురజాడ విశిష్ట పురస్కారాన్ని నిర్వాహకులు అందజేస్తున్నారు. నవంబరు 30వ తేదీన ఆయన వర్థంతి సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు ఈ పురస్కరాన్ని ప్రదానం చేయాలని నిర్ణయించారు.
అయితే దీనిపై హేతువాదులు, కవులు, కళాకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురజాడ అప్పారావు తన జీవితకాలం మొత్తం హేతువాదిగా, అభ్యుదయవాదిగా ఉన్నరాని, అందుకు భిన్నమైన మార్గంలో సాగుతున్న చాగంటి భగవంతుడి గురించి ప్రవచనాలు చెబుతారని, పరస్పర విరుద్ధ వైఖరులతో ఉన్నప్పుడు అవార్డు ఎలా ప్రకటిస్తారంటున్నారు. పురస్కారాన్ని ప్రదానం చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. విజయనగరంలో గురజాడ అప్పారావు ఇంటి నుంచి నిరసన ర్యాలీ చేశారు.
గురజాడ భావజాలానికి వ్యతిరేక భావజాలం కలిగిన చాగంటిని ఎలా ఎంపిక చేశారని ప్రశ్నిస్తున్నారు. ఈ నిరసనల మధ్య 30వ తేదీన పురస్కారాన్ని చాగంటి అందుకుంటారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.
ఇప్పటి వరకు గురజాడ పురస్కారాన్ని ఎస్పీ బాలసుబ్రమణ్యం, గరికపాటి నరసింహారావు, డైరెక్టర్ కె.విశ్వనాథ్, గొల్లపూడి మారుతీరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డైరెక్టర్ క్రిష్, రామజోగయ్యశాస్త్రి, తనికెళ్ల భరణి, అంజలీదేవి, గుమ్మడి, షావుకారు జానకి, సి.నారాయణరెడ్డి, సుద్దాల అశోక్ తేజ, మల్లెమాల, రావి కొండలరావు, డైరెక్టర్ వంశీ, మొదటి నాగభూషణ శర్మ తదితర ప్రముఖులు అందుకున్నారు. గతంలో ఈ తరహా వివాదం ఎప్పుడూ తలెత్తలేదు. చాగంటిగారు ఏం చేస్తారో చూడాలి మరి.!