నాపై కక్ష కట్టిన జగన్:ఎమ్మెల్యే యరపతినేని;చంద్రబాబును చూసి మోడీకి అసూయ:పుల్లారావు
గుంటూరు:తనను రాజకీయంగా ఎదుర్కోలేక వైసిపి ఇలా కుట్ర చేస్తోందని, వచ్చే ఎన్నికల్లో ప్రజల సమక్షంలోనే వైసిపి సంగతి తేలుస్తామని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ మండిపడ్డారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్,వైసిపిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సరస్వతీ భూముల విషయంలో తాను రైతులకు అండగా ఉన్నందుకే జగన్ తనపై కక్ష కట్టారని ఆయన ఆరోపించారు. వైసిపి వల్లే పల్నాడులో 25 వేల మంది క్వారీ కార్మికులు రోడ్డున పడ్డారని యరపతినేని ఆరోపించారు. వైసిపి నిజ నిర్ధారణ కమిటీలో అందరూ దోపిడీ దొంగలేనని యరపతినేని దుయ్యబట్టారు.
మరోవైపు గురజాలలో రాష్ట్ర గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ దాసరి రాజా మాస్టారు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ యరపతినేనిని ఎదుర్కోలేకే వైసిపి నేతలు మైనింగ్ ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సరస్వతీ భూముల విషయంలో యరపతినేని అడ్డుపడకుంటే వైసీపీ గుండాల చేతుల్లో ఎంతో మంది రైతులు బలయ్యేవారని అన్నారు. గురజాల నుంచి స్వయంగా జగన్ పోటీ చేసినా యరపతినేనిని ఓడించలేరని దాసరి రాజామాస్టర్ తేల్చిచెప్పారు.
ఇదిలావుంటే కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసి టీడీపీని, చంద్రబాబు ఇమేజ్ను దెబ్బతీయడానికి కుట్రపన్నుతున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. బుధవారం హనుమాన్జంక్షన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశచరిత్రలో అమరావతి బాండ్ల అమ్మకం ఒక రికార్డు బ్రేక్ అని పుల్లారావు చెప్పుకొచ్చారు. కేవలం గంటవ్యవధిలో రూ.1300 కోట్ల బాండ్లు ఇష్యూకు పిలుపు ఇస్తే రూ.2వేల కోట్ల బాండ్లు విక్రయం జరగడం దేశ చరిత్రలోనే లేదన్నారు.
ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్కు తార్కాణమని...చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ను చూసి ప్రధాని మోడీ కూడా అసూయ పడుతున్నారని పుల్లారావు వ్యాఖ్యానించారు. మోడీకి అమరావతి మీద నమ్మకం లేకపోయినా చంద్రబాబు మీద దేశ ప్రజలకు మాత్రం అపార నమ్మకం ఉందన్నారు. చంద్రబాబుకు ఉన్న ఈ ఇమేజ్ చూసైనా కేంద్రం అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మంత్రి ప్రత్తిపాటి విజ్ఞప్తిచేశారు.
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన రేషన్ సరుకులకు నగదు బదిలీ అంశం చూస్తే ఆయనకు అనుభవం, అవగాహన రెండూలేవని తేలిందన్నారు. రాష్ట్రంలో ఉన్న కోటిన్నర కార్డులకు పవన్ చెప్పిన విధంగా నగదు ఇవ్వాలంటే ఏడాదికి రూ. 50 వేల కోట్లు కావాల్సి వుంటుందన్నారు. మరి అంత మొత్తం పవన్ ఎక్కడి నుంచి తెస్తారని మంత్రి పుల్లారావు ప్రశ్నించారు.
జనసేన మ్యానిఫెస్టోలో మిగతావన్నీ చంద్రబాబు అమలుచేస్తున్న పథకాలేనని మంత్రి పుల్లారావు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఒక బడ్జెట్, పవన్ కల్యాణ్ ఒక బడ్జెట్ చెబుతున్నారు. వీల్లిద్దరూ ఇద్దరూ ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం లేదు కాబట్టే ఎన్నయినా చెబుతారని ఎద్దేవా చేశారు.