పల్నాడులో హైటెన్షన్: మాచర్లలో పిన్నెల్లి, పిడుగురాళ్లలో యరపతినేని హౌస్ అరెస్ట్
అమరావతి: గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అవినీతిపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి సోమవారం బహిరంగ వేదికగా చర్చా గోష్టి నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆధారాలతో సిద్ధమైన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వేదిక వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్లలోని ఆయన నివాసం వద్ద 200 మంది సాయుధ బలగాలను రంగంలోకి దించారు. పరిస్థితి చేయి దాటిపోతుందని ముందుగానే భావించిన పోలీసులు మాచర్ల, గురజాల, దాచేపల్లిలలో 144 సెక్షన్ విధించారు.
ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. ఇప్పటికే మాచర్ల, గురజాల నియోజక వర్గాల్లో ఇరు పార్టీలకు చెందిన పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రెండు నియోజకవర్గాల్లో భారీగా మోహరించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే... ఇటీవల ముగిసిన కృష్ణా పుష్కరాల్లో అవినీతి జరిగిందంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి, జరగలేదంటూ గురజాల ఎమ్మెల్యే యరపతినేని సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ పిన్నెల్లి విసిరిన సవాల్కు యరపతినేని సై అన్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 29 (సోమవారం) నడికుడి మార్కెట్ యార్డులో చర్చకు రావాలంటూ పిన్నెల్లికి యరపతినేని సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరించిన యరపతనేని చర్చకు అంగీకరించారు. ఈ క్రమంలో ఇద్దరు సోమవారం దాచేపల్లి మార్కెట్ యార్డుకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెందిన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాదు బహిరంగ చర్చలకు దూరంగా ఉండాలని పోలీసులు ఇరువురు నేతలకు తెలిపారు. ఈ కారణం చేతనే ఆ రెండు నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మీడియా దీనిని ఆధిపత్య పోరుగా అభివర్ణిస్తోంది. గత కొంతకాలంగా వైసీపీకి చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో గురజాల ఎమ్మెల్యే ప్రాబల్యం ఎక్కువగా ఉందనే వాదన వినిపిస్తోంది. ఒకానొక దశలో ఎమెల్యేలిద్దరూ తమ పదవులకు రాజీనామా చేసి గురజాల నుంచి పోటీ చేయాలని సవాల్ కూడా విసురుకున్నారు.
ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరిపై మరొకరు పరస్పరం అవినీతి ఆరోపణలు కూడా చేసుకున్నారు. గత పది రోజులుగా రెండు నియోజక వర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పిన్నెల్లి కృష్ణా పుష్కరాల్లో అవినీతి జరిగిందంటూ సవాల్ విసిరారు. కృష్ణా పుష్కరాల విధులను నిర్వహించిన ఉద్యోగులకు సోమవారం అభినందన సభ ఏర్పాటు చేశారు.
ఆ ఉద్యోగుల ముందే యరపతినేని అవినీతిని బయటపెడతానని పిన్నెల్లి సవాల్ విసిరారు. ఈ సవాల్ని గురజాల ఎమ్మెల్యే యరపతినేని కూడా స్వాగతించారు. అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. అయితే వీరిద్దరి సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న పల్నాడు ఒక్కసారిగా వేడెక్కడంతో శాంతి భద్రలకు విఘాతం కలుగుతుందని గ్రహించిన జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ జోక్యం చేసుకుని ఇద్దరినీ కలిసి సమస్యను సామరస్యంగా చర్చించుకోవాలని సూచించారు.
ఆధారాలుంటే కోర్టుకు సమర్పించాలని ఆయన సూచించారు. మరోవైపు పిన్నెల్లి సవాల్ను స్వీకరించిన యరపతినేని గుంటూరు నుంంచి బయల్దేరిన క్రమంలో పిడుగురాళ్లకు చేరుకోగానే ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై అటు టీడీపీ శ్రేణులు, ఇటు వైసీపీ శ్రేణులు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నాయి. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో వీరిద్దరి సవాళ్లు చిచ్చు పెట్టేలా ఉన్నాయని స్థానికులు అంటున్నారు.