టిడిపిలోకి గుర్నాథ్రెడ్డి, చిచ్చు: పక్కన కూడా నిల్చోను, హత్యలు-కబ్జాలు.. ప్రభాకర్ చౌదరి నిప్పులు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా నేత గుర్నాథ్ రెడ్డి గురువారం టీడీపీలో చేరే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన అమరావతికి చేరుకున్నారు. ఆయన తన అనుచరులతో కలసి సైకిల్ ఎక్కనున్నారు.
Recommended Video
మరో వికెట్, జగన్కు గుర్నాథ్రెడ్డి షాక్: కారణాలివే.. బాబుకు ప్రభాకర్ హింట్, అంతలేదంటూ హామీ
గుర్నాథ్ రెడ్డి టిడిపిలో చేరితే జగన్కు ఇది మరో పెద్ద షాక్. ఆయనకు గట్టి అండగా ఉన్నవారు టీడీపీలోకి వెళ్తుండటం గమనార్హం. ఆయన మిస్సమ్మ బంగ్లా, వ్యాపారాల కోసమే టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా, గుర్నాథ్ రెడ్డిని చేరికపై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
గుర్నాథ్ రెడ్డి రాకపై ప్రభాకర్ చౌదరి అసంతృప్తి
ఇప్పటికే ప్రభాకర్ చౌదరితో చంద్రబాబు మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటకీ ప్రభాకర్ పట్టు వీడలేదు. దీంతో, వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడం చంద్రబాబుకు కష్టమేనని భావిస్తున్నారు. గుర్నాథ్ రెడ్డి రాక వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని ప్రభాకర్ చౌదరి భావిస్తున్నారు. అంతేకాదు గుర్నాథ్ రాకకు జేసీ మద్దతు ఉందని చెబుతున్నారు.
చంద్రబాబు పక్కన నిలబడే అర్హత లేదు
గుర్నాథ్ రెడ్డి పైన ప్రభాకర్ చౌదరి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. హత్యలు, కబ్జాలే గుర్నాథ్ చరిత్ర అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన నిలబడే అర్హత కూడా ఆయనకు లేదన్నారు.
ఆయన పక్కన కూడా నిల్చోను, జేసీ గ్రూప్ కాబట్టే
టిడిపిలో గుర్నాథ్ రెడ్డి చేరిక కార్యక్రమానికి తాను హాజరుకానని ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు. ఆయన పక్కన నిలబడి ఫొటో దిగడానికి కూడా తాను ఇష్టపడనన్నారు. జేసీ దివాకర్ రెడ్డి గ్రూపు కాబట్టే ఆయనను టీడీపీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు.
జేసీ తప్ప ఎవరి మద్దతు లేదు, అనంత టిడిపిలో చిచ్చు
జేసీ మినహా జిల్లాలో మరెవరూ ఆయనకు మద్దతు ఇవ్వడం లేదని ప్రభాకర్ చెప్పారు. పార్టీలో నిఖార్సుగా ఉంటే లాభం లేదనే విషయం తనకు అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్నాథ్ టీడీపీలో చేరడాన్ని ముందునుంచి కూడా ప్రభాకర్ వ్యతిరేకిస్తున్నారు. వీరిద్దరికీ రాజకీయ వైరం ఉంది. దీంతో అనంతపురం టీడీపీలో చిచ్చు రాజుకుంది.