జగన్ గురించి అర్థమై టీడీపీలో చేరా, నా వద్ద డబ్బు లేదు, అప్పు తెచ్చుకుంటా: గుర్నాథ్ రెడ్డి
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు సుముఖంగా లేరని, ప్రజా సమస్యలపై ఆయనకు చిత్తశుద్ధి లేదని తనకు అర్థమయిందని, అందుకే పార్టీ మారానని అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాను హత్యా రాజకీయాలు చేశానని టిడిపి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్పడాన్ని ఖండించారు. తనపై ఆరోపణలు ఉన్నాయని, కానీ ఎలాంటి కేసులు తనపై లేవని చెప్పారు. ప్రభాకర్ చౌదరి ఎక్కడ కనిపించినా అన్నా బాగున్నావా అని అడుగుతానని చెప్పారు.
వైసీపీ నుంచి వస్తారు అంతే, కొట్టుకుంటారా: పార్టీ నేతలపై ఆగ్రహం
అందుకే ఐదుసార్లు గెలిచా
మిస్సమ్మ భూములు సౌతిండియన్ చర్చికి సంబంధించినవని గుర్నాథ్ రెడ్డి తెలిపారు. అందులో ఏదైనా సమస్య ఉంటే రెవెన్యూ విభాగం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వదు కదా అని చెప్పారు. బీటెక్ రవి తనకు స్నేహితుడే కానీ భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చేంద సాన్నిహిత్యం తమ మధ్య లేదని చెప్పారు. శాంతిని కోరుకుంటున్నానని చెప్పారు. అలా ఉండడం వల్లే అర్బన్లో ఐదుసార్లు గెలిచానన్నారు.
పరిటాల కుటుంబంతో మంచి సంబంధాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు పని తీరుపై నమ్మకంతోనే తాను పార్టీ మారానని గుర్నాథ్ రెడ్డి తెలిపారు. పరిటాల రవితో తనకు మంచి సంబంధాలు ఉండేవని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే పరిటాల కుటుంబంతో సంబంధాలు ఉన్నాయన్నారు. తమ కుటుంబం కాంట్రాక్టులు చేసినప్పటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు.
డబ్బు లేదు, ఇప్పటికీ అప్పులు తెచ్చుకుంటాం
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో టీడీపీ నేత సీఎం రమేష్ కోట్ చేసిన ధర కంటే పదహారు శాతం తక్కువకు కాంట్రాక్టులు వచ్చాయని గుర్నాథ్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టు పనులు చేసేటప్పుడు తామే ప్రత్యక్షంగా వెళ్లి పనుల దగ్గర ఉంటామన్నారు. వేగంగా పనులు చేయడం వల్లే తమకు రూపాయి మిగిలిందన్నారు. ఇప్పటికీ తాము వడ్డీకి అప్పులు తెస్తుంటామని చెప్పారు. తమ దగ్గర డబ్బులున్నాయని అంతా అనుకుంటారని, కానీ వాస్తవానికి తమ వద్ద పెద్దగా డబ్బు లేదన్నారు. ప్రజాభిమానమే ఉందని చెప్పారు.
నాకు హామీ రాలేదు
ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో తాను మాట్లాడే ప్రయత్నం చేశానని, అయితే ఆయన తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని గుర్నాథ్ రెడ్డి చెప్పారు. టిడిపిలో తన చేరికను అందరూ ఆహ్వానించారన్నారు. ప్రజా సంక్షేమం కోసం తాను ఎవరితోనైనా రాజీపడేందుకు సిద్ధమన్నారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నుంచి పోటీపై టీడీపీ నంచి హామీ వచ్చినందునే పార్టీ మారానని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. బేషరతుగా తాను పార్టీ మారానని చెప్పారు.