వైయస్ జగన్తో పొత్తుకు సిపిఎం తహతహ: గుత్తా
తెలంగాణపై సిపిఎం వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగుడాలో డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని గతంలో చెప్పిన బివి రాఘవులు ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఓటు వేస్తామనడం సరి కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే వైయస్ జగన్ హైదరాబాదులో సమైక్య సభ నిర్వహిస్తున్నారని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. తండ్రి మాటపై విశ్వాసం లేని జగన్ మాటలను సీమాంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన ఆదివారం వరంగల్లో అన్నారు. సమైక్య రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు కోరడం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ అంశంపై కాంగ్రెసు పార్టీ కచ్చితంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. యూ టర్న్ తీసుకున్న నేతలను ప్రజలు గమనిస్తున్నారని, వారికి గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు తెలంగాణ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కనుమరుగైందని ఆయన అన్నారు. ఆ పార్టీలో కొనసాగితే తల్లిదండ్రులు కూడా క్షమించరని ఆయన అన్నారు.