చంద్రబాబుకు షాకిచ్చారు! ఎక్కువ నిధులు వచ్చాయని ఏపీ సీఎస్సే చెప్పారు: బీజేపీ కౌంటర్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబులు ఢిల్లీలో తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు, టీడీపీ ఎంపీలు డ్రామాలు కట్టిపెట్టాలన్నారు.
సర్వే దెబ్బ, కేసీఆర్ ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబులో మార్పు ఎందుకంటే?
అసలు చంద్రబాబు ఏం చేశారు?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని టీడీపీ నట్టేట ముంచిందని జీవీఎల్ నర్సింహా రావు అన్నారు. చంద్రబాబుకు నరేంద్ర మోడీ ఫోబియా పట్టుకుందని విమర్శించారు. జాతీయస్థాయిలో చంద్రబాబు ఏం చేశారని ఆయనను చూసి మోడీ భయపడాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర పథకాలతో సంబంధం లేకుండా అదనంగా ముఖ్యమంత్రి ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు. టీడీపీ ఎంపీలు ఢిల్లీలో డ్రామా రాజకీయం మానుకోవాలని హితవు పలికారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇస్తున్నప్పటికీ కేంద్రాన్ని, ప్రధాని మోడీని విమర్శిస్తూ రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కూర్చున్న కొమ్మను నరుక్కునే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. ఆర్భాటం, ప్రచారం, ఇతరులను నిందించడం తప్ప రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. హైకోర్టు నిర్మాణానికి 8 నెలల సమయం ఉన్నా కట్టే సత్తా టీడీపీకి లేదు కానీ ప్రపంచంలో 4వ రాజధానిని నిర్మిస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
ఎక్కువ నిధులు తెచ్చామని ఏపీ అదికారులే చెప్పారు
కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదేపదే అసత్య ఆరోపణలు చేస్తోందని బీజేపీ నేత కంభంపాటి హరిబాబు మండిపడ్డారు. 2018-19కి గాను కేంద్రం నుంచి రూ.6,243 కోట్లు నరేగా నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. అధికంగా నిధులు సాధించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే స్వయంగా చెప్పారన్నారు. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు అని అభిప్రాయపడ్డారు. నిధులు ఇచ్చిన కేంద్రం గురించి మాట్లాడకుండా రాష్ట్ర అధికారులను సీఎం అభినందించడం విడ్డూరమన్నారు.
ప్రధానిపై విమర్శలా?
కేంద్రం సహకరించడం లేదని నిందలు మోపడం ఏమాత్రం సరికాదని కంభంపాటి అన్నారు. ధర్మపోరాట దీక్షలు, నవనిర్మాణ దీక్షలు, కలెక్టర్ల కాన్ఫరెన్సులలో ముఖ్యమంత్రి.. ప్రధానిపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చేయాల్సిందంతా చేస్తోందన్నారు.