సుజనకు తెలియదా? అమిత్ షా కొడుకు సరే, లోకేష్పై పవన్కు జవాబివ్వు: బాబుకు జీవీఎల్ దిమ్మతిరిగేలా
అమరావతి/న్యూఢిల్లీ: కేంద్రం నుంచి ఏపీకి సహకారం లేదని, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా లెక్కలు తప్పని చెప్పిన టీడీపీ నేతలకు బీజేపీ నేత జీవీఎల్ నర్సింహా రావు సోమవారం గట్టి కౌంటర్ ఇచ్చారు. టీడీపీలో లెక్కలు కట్టే ఉద్దండులు చాలామందే ఉన్నారని, మరి మొన్నటి వరకు కేంద్రంలో ఉన్నప్పుడు తెలియదా అని ప్రశ్నించారు.
Recommended Video
పవన్ కళ్యాణ్కు 2+2 భద్రత, ఇక సమయం చూసి 'ఆమరణ'పై అడుగు
టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు ఎప్పుడు వస్తుందా అని తాము (బీజేపీ) కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. టీడీపీ కాకమ్మ కబుర్లను తాము పార్లమెంటులో లేవనెత్తుతామని చెప్పారు. అప్పుడు నిజాలేమిటో అందరికీ తెలుస్తాయన్నారు.
ఏమిచ్చామో లెక్కలు ఉన్నాయి
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ యూటర్న్ తీసుకొని మాపై నిందలు వేస్తున్నారని జీవీఎల్ నర్సింహా రావు మండిపడ్డారు. తాము ఏమిచ్చామో అన్నీ లెక్కలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
టీడీపీలో ఉద్దండులు ఉన్నారు సరే
కేంద్రం ఏమిచ్చిందో.. ఏం ఇవ్వలేదో లెక్కగట్టే ఉద్దండులు టీడీపీలో చాలామందే ఉన్నారని జీవీఎల్ నర్సింహా రావు ఎద్దేవా చేశారు. మరి కేంద్రం ఏం ఇచ్చిందో మొన్నటి వరకు కేంద్రమంత్రులుగా ఉన్న వారికి తెలియదా అంటూ అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కుతంత్రం, దుమారం కోసం చంద్రబాబు వైదొలిగారు
నిన్నటి దాకా కేంద్రమంత్రులుగా ఉన్న వారు తమతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారు కదా అని ప్రశ్నించారు. సభలో అవిశ్వాసంపై చర్చ జరిగితే ఏపీకి ఇప్పటి వరకు చేసిన సాయాన్ని సభ ముందు ఉంచుతామని జీవీఎల్ చెప్పారు. రాజకీయ కుతంత్రం, దుమారం కోసం చంద్రబాబు ఎన్డీయే నుంచి వైదొలిగారని నిప్పులు చెరిగారు. టీడీపీకీ ప్రజల పట్ల కనీస బాధ్యత లేదన్నారు. యుటిలైజేషన్ సర్టిఫికేట్లు ఎక్కడ ఇచ్చారన్నారు. టీడీపీ నేతలు చెప్పే కాకమ్మ కబుర్లను ఇప్పుడు చంద్రన్న కబుర్లు అనవచ్చునని వ్యాఖ్యానించారు.
టీడీపీ కూడా అడ్డుపడుతోందని షాకింగ్ కామెంట్స్
అసలు, పార్లమెంటులో నిత్యం అడ్డుపడుతూ ఆందోళనలు చేస్తోంది తెలుగుదేశం పార్టీయేనని జీవీఎల్ అన్నారు. బీజేపీకి సొంతగా 273 మంది మద్దతు ఉందని చెప్పారు. ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగినా భాగస్వామ్య పక్షాలపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. అవిశ్వాసం విషయంలో తాము తగ్గేది లేదన్నారు. అవిశ్వాసంపై చర్చ జరిగే సమయంలో టీడీపీ అబద్దాలు బట్టబయలు అవుతాయన్నారు. మీరు చేస్తే రాష్ట్రానికి మేలు, ఇతరులు చేస్తే అన్యాయం అంటారా అని మండిపడ్డారు. వెల్లోకి వెళ్లి నిరసన చేస్తున్న ఇతర పార్టీలతో సమానంగా టీడీపీ చేస్తోందన్నారు.
అమిత్ షా తనయుడిపై ఆరోపణల మీదా, లోకేష్ మాటేమిటి
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తనయుడిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై జీవీఎల్ స్పందించారు. ఆయన వ్యాపారంలో నష్టపోయారని, అలాంటి వ్యక్తిపై ఆరోపణలు విడ్డూరమన్నారు. ఆయనపై ఓ వెబ్ పత్రిక తప్పుడు కథనం రాస్తే చర్యలు తీసుకున్నామని, కోర్టు కూడా అక్షింతలు వేసిందన్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్ పైన వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పరేమిటన్నారు. పవన్ కళ్యాణ్ సహా అందరూ మాట్లాడారని, వాటికి సమాధానం చెప్పరా అని నిలదీసారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు.. మొదట అమిత్ షా కొడుకు అవినీతి ఆరోపణలపై చర్చించాలని చంద్రబాబు విమర్శించారు. దీనిపై జీవీఎల్ పైవిధంగా స్పందించారు.