బాబూ! మాపైనే నిందలా? లెక్క చెబుతా: జీవీఎల్, ‘టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించు’
న్యూఢిల్లీ/ప్రకాశం: ఇప్పటికైనా హోదాపై చిత్తశుద్ది ఉంటే టీడీపీ ఎంపీలు సైతం తమతోపాటు రాజీనామాలు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీ నుంచి ఐదుగురు ఎంపీలే ఉన్నా చిత్తశుద్ధితో హోదాపై పార్లమెంట్లో పోరాటం చేస్తున్నామన్నారు. టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.
అప్పుడే రాజీనామాలు
తమ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు పార్లమెంట్ నిరవధిక వాయిదా పడిన రోజే ఏంపీ పదవులకు రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు. హోదాపై చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామాల విషయంలో తమతో కలిసి రావాలని ఆయన సూచించారు.
బాబూ.. మాపైనే నిందలే
ఇది ఇలావుంటే.. టీడీపీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆసక్తిగా ఉన్నామన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన సీఎం చంద్రబాబు.. మాపై నిందలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
బాబు చర్యతో ఇబ్బందేం లేదు
‘నిధుల విషయంలో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కుమారుడిపై వ్యాఖ్యలు అవివేకం. కేంద్రం ఇచ్చిన నిధులపై టీడీపీ చెప్పేవన్నీ కాకమ్మ కబుర్లు. ఎన్డీఏ నుంచి వైదొలగడం టీడీపీ ఆడుతున్న డ్రామా. సీఎం చంద్రబాబు ఆరోపణలకు పార్లమెంట్ సమావేశాల్లోనే సమాధానం చెబుతాం. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు చంద్రబాబు ప్రజల ముందు పెట్టాలి. టీడీపీ లేకున్నా ఎన్డీఏకు ఎలాంటి ఇబ్బంది లేదు. మిగితా భాగస్వాములపై ప్రభావం ఉండదు' అని జీవీఎల్ తేల్చి చెప్పారు.
లెక్క చెబుతాం
‘ఇప్పటి వరకు ఏపీకి చేసిన సాయాన్ని ప్రజల ముందుంచుంతాం. నిజానిజాలేమిటో అప్పుడే తెలుస్తాయి. రాజకీయ కుతంత్రం, దుమారం కోసమే ఎన్డీఏ నుంచి వైదొలిగారు. ఏమిచ్చామో.. ఏమివ్వలేదో లెక్కలు కట్టే ఉద్దండులు టీడీపీలో చాలా మంది ఉన్నారు. మొన్నటి వరకు కేంద్ర మంత్రులుగా ఉన్నవారికి తెలియదా?.. మాతో చెట్టాపట్టాలేసుకుని కేంద్ర మంత్రులు తిరగలేదా?' అంటూ జీవీఎల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.