‘టీడీపీ చిల్లర రాజకీయం’: అమెరికాలో బీజేపీ ఎంపీ జీవీఎల్కు హోదా సెగ
న్యూయార్క్/అమరావతి: ప్రత్యేక హోదా అంశం బీజేపీ నేతలను వెంటాడుతూనే ఉంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళుతుండగా.. టీడీపీ శ్రేణులు ఆయన కాన్వాయ్పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఏపీలో తీవ్ర రాజకీయ దుమారమే రేపింది.
తాజాగా, అమెరికాలోని న్యూజెర్సీలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావుకు కూడా టీడీపీ నేతలుగా పేర్కొంటున్న కొందరు ప్రవాసాంధ్రుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటక విజయాన్ని పురస్కరించుకుని ఎన్నారై బీజేపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న నర్సింహారావుపై ప్రవాసాంధ్రులు ప్రశ్నల వర్షం కురిపించారు.
Dear @ncbn Garu, Your NRI-TDP members came to disrupt our meeting after your party sent messages. Stop degrading yourself with such drama & cheap stunts. For god's sake, focus on governance. Else, you will end up a bigger loser than your role models Siddaramaiah & Rahul Gandhi.
— GVL Narasimha Rao (@GVLNRAO) May 17, 2018
ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మోసం చేశారెందుకని నిలదీశారు. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని జీవీఎల్ చెప్పినప్పటికీ వారు సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఎన్నికల ముందు హోదా ఇస్తామని మోడీ ప్రకటన చేశారని, ఇప్పుడు మాట మార్చారని ప్రవాసాంధ్రులు ఆరోపించారు. కాగా, ఓ వైపు బీజేపీ మద్దతుదారులు వద్దని వారిస్తున్నా కొందరు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ అనుకూల, నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది.
కాగా, పలువురు ఎన్నారై టీడీపీ నేతలు, కార్యకర్తలను పంపి తాము నిర్వహించుకుంటున్న సమావేశానికి ఆటంకం కలిగించడం ఏ మాత్రం సరికాదంటూ ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి జీవీఎల్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు టీడీపీకి అలవాటేనని విమర్శించారు. తమ సమావేశానికి రావడం కాకుండా.. తాము సమాధానం చెబుతున్నా వినకుండా.. ఆందోళనలు చేపట్టారని మండిపడ్డారు. వీరు తమ సమావేశానికి ఇబ్బందులు సృష్టించేందుకే వచ్చారని ఆరోపించారు.