రాహుల్తో నారా లోకేష్.. సోనియాతో చంద్రబాబును పోల్చుతూ జీవీఎల్ ఏకిపారేశారంతే!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంపై కొనసాగుతున్న సంక్షోభంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు కోరుతూ కొందరు సీనియర్ నేతలు లేఖలు రాయడం, నేటి సీడబ్ల్యూసీ సమావేశంలో దీనిపై చర్చలు జరగడం.. చివరకు సోనియా గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని నిర్ణయించడం చకచకా జరిగిపోయిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ సంక్షోభానికి బీజేపీనే కారణం..
ఈ నేపథ్యంలో ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభానికి బీజేపీనే కారణమని అన్నారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాదరణ పొందడం కారణంగానే కాంగ్రెస్ పతనానికి చేరుకుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వం తీవ్ర నిరాశతో ఉందన్నారు. జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీని వీడారు.. మరో సీనియర్ నేత సచిన్ పైలట్ కూడా దాదాపు పార్టీనే వీడేందుకు సిద్ధపడ్డారని.. కుటుంబ పార్టీలో ఈ తరహా పరిస్థితి ఎప్పటికైనా తప్పదని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ...
ప్రజలు కూడా కేవలం రాజకీయాలు చేసే పార్టీల వైఖరితో విసిగిపోయి ఉన్నారని అన్నారు. చైనా విషయంలో ఆర్మీ స్థైర్యాన్ని దెబ్బతీసేలా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రజలు మర్చిపోరని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ కొంత మేర ఉనికిని చాటుకుంటున్నా.. ఏపీలో మాత్రం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్నారు. కాంగ్రెస్ తరహాలోనే టీడీపీ కూడా అదే బాటలో పయనిస్తోందన్నారు. ఏపీలో టీడీపీ కూడా అదే పరిస్థితిలో ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రజల అభిమానం చూరగొని అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని జీవీఎల్ నర్సింహారావు ధీమా వ్యక్తం చేశారు.
‘మీ రాహుల్ మీ ఇష్టం.. మీ లోకేష్ మీ ఇష్టం'..
టీడీపీకి మరో మైనస్ పాయింట్ కూడా ఉందని.. అది అధికారంలో లేకపోవడం.. మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమూ లేకపోవడమని అన్నారు జీవీఎల్. ప్రజలు ప్రతిభ, సమర్థతను కోలుకుంటున్నారని.. కుటుంబాలకు చెందిన వ్యక్తులను కాదని జీవీఎల్ కాంగ్రెస్, టీడీపీలకు చురకలంటించారు. టీడీపీని అభిమానించే పత్రికాధినేతలు ఉన్నారని సెటైర్లు వేశారు. కాంగ్రెస్, టీడీపీలను కూడా ‘మీ రాహుల్ మీ ఇష్టం.. మీ లోకేష్ మీ ఇష్టం' అంటారో లేదా చూడాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలహీనపడిందని సామాన్య కార్యకర్తలకు అర్థమైందని జీవీఎల్ అన్నారు.
Recommended Video
కాంగ్రెస్ తల్లీతనయుల పార్టీ.. టీడీపీ తండ్రీతనయుల పార్టీ..
కాంగ్రెస్ పార్టీకి ఉన్న దుర్లక్షణాలు ఏవైతో ఉన్నాయో.. అవన్నీ పుణికి పుచ్చుకున్న పార్టీ టీడీపీ అని విమర్శించిన ఆయన.. ఏపీలో కుటుంబ రాజకీయాలతో ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకున్న పార్టీ అని అన్నారు. వంశపారంపర్య రాజకీయాల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీపై ఏ విధంగా అయితే నమ్మకం లేదో.. టీడీపీలోనూ రెండో తరం నాయకులపై, ముఖ్యంగా లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేదని జీవీఎల్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తల్లీతనయుల పార్టీ అయితే.. టీడీపీ తండ్రీతనయుల పార్టీ అని జీవీఎల్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీల భవిష్యత్ ప్రశ్నార్థకమేనని అన్నారు.