చంద్రబాబూ! స్నేహితుడి కొడుకుపై ఇలానా: జగన్ మీద దాడి ఘటనపై లక్ష్మీపార్వతి ఆగ్రహం
అమరావతి: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పే ప్రయత్నాలు చేశారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు సోమవారం అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టే ఉద్దేశ్యం కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదని చెప్పారు.
ఎలాగూ ఆరు నెలల్లో రాష్ట్ర ప్రజలే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారని వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నారని చెప్పారు.
అసలు ఆ విషయాలు ముఖ్యమంత్రి వద్ద ఎలా ఉంటాయి?
స్వతంత్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ కావాలని వైసీపీ కోరుతుంటే తెలుగుదేశం పార్టీ వద్దని చెప్పడం దారుణమని, ఇలా ఎందుకు చెబుతుందని జీవీఎల్ ప్రశ్నించారు. తన వద్ద అన్ని వివరాలు ఉన్నాయని చంద్రబాబు చెబుతున్నారని, అసలు విచారణకు సంబంధించిన వివరాలు ముఖ్యమంత్రి వద్ద ఎలా ఉంటాయని ప్రశ్నించారు.
చంపడానికే జగన్పై దాడి, ఆ కోణంలో దర్యాఫ్తు జరపాలి
జగన్ పైన దాడి ఆయనను చంపడానికేనని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని జీవీఎల్ గుర్తు చేశారు. అసలు జగన్ పైన దాడి వల్ల ఎవరికి లాభం అనే కోణంలో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే నిజానిజాలు వెలుగు చూస్తాయని చెప్పారు. దర్యాఫ్తును ఎవరు తప్పుదారి పట్టించారని ప్రశ్నించారు.
శివాజీతో చెప్పిస్తాం, నాపై ఐటీ దాడులు చేస్తారు, జగన్పై దాడితో ఇదీ ప్లాన్: బాబు కీలక వ్యాఖ్యలు
స్నేహితుడి కొడుకుపై హత్యా రాజకీయాలు?
జగన్ పైన దాడి విషయంలో చంద్రబాబు, లోకేష్లు దిగజారి మాట్లాడుతున్నారని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబుకు ప్రత్యక్ష రాజకీయాలు తెలియవని ఎద్దేవా చేశారు. ఆయనకు తెలిసిందంతా వెన్నుపోటు, హత్యా రాజకీయాలే అన్నారు. చంద్రబాబూ.. నీ స్నేహితుడి (వైయస్ రాజశేఖర రెడ్డి) కొడుకు పైనా హత్యా రాజకీయాలు చేస్తావా అని ప్రశ్నించారు. సినిమా నటుడు శివాజీ చెబుతున్న ఆపరేషన్ గరుడ చంద్రబాబు నాయుడు సృష్టించిందేనని అన్నారు.
చంద్రబాబుకు మైండ్ పని చేయడం లేదని అర్థమవుతోంది
చంద్రబాబుకు మైండ్ సరిగా పని చేయడం లేదనే విషయం తనకు స్పష్టంగా అర్థమవుతోందని లక్ష్మీపార్వతి అన్నారు. జగన్ను అంతం చేయాలనే ప్రయత్నం జరిగిందన్న విషయం చంద్రబాబు వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇంకెన్ని దాడులు చేయిస్తారోననే భయం నెలకొందని చెప్పారు. హత్యా రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు చేజారిపోయాయన్నారు. ఏమాత్రం మానవత్వం ఉన్నా అసెంబ్లీని రద్దు చేసి చంద్రబాబు ఎన్నికలకు సిద్ధం కావాలని, తమ సత్తా ఏమిటో ఎన్నికల్లో చూపిస్తామన్నారు.