అదే మోడీ లక్ష్యం: సీఎం రమేష్ ఆస్తులపై ఐటీ సోదాలపై జీవీఎల్ నర్సింహా రావు
అమరావతి: తెలుగుదేశం పార్టీ అవినీతి బట్టబయలు అవుతున్న సమయంలో తప్పుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. మంత్రి నారా లోకేష్ కూడా చెబుతున్నారని అన్నారు. ఐటీ కంపెనీల పేరుతో మీరు బినామీ కంపెనీలకు వేల కోట్లు దోచి పెట్టడం ఎంత వరకు సమంజసమని, దాని గురించి మాట్లాడాలని ప్రశ్నించారు.
రాజకీయ ఆరోపణలు కాకుండా ఐటీ దాడుల విషయంలో నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. నారా లోకేష్ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తే ఇంకా అబాసుపాలు అవుతారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతలు దొంగ దీక్ష చేశారని, టీడీపీ నేతల అంతర్గత సమావేశాల్లోనే ఈ దొంగ దీక్షలు బట్టబయలయిందని విమర్శించారు.
ఐటీ శాఖకు నోటీసు: ఏపీ ఐటీ దాడులపై సీఎం రమేష్ ఆరా తీసిన మూడ్రోజుల్లోనే.. సోదాలపై ఏమన్నారంటే
అదే మోడీ లక్ష్యం
దేశంలో అవినీతిని నిర్మూలించాలి, నల్లధనం ఉండకూడదనే లక్ష్యంతో మోడీ ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఎవరి పైన ఆరోపణలు వచ్చినా ఆయా సంస్థలు స్పందించే స్వతంత్ర్యం మోడీ ప్రభుత్వం హయాంలో ఉందని జీవీఎల్ నర్సింహా రావు చెప్పారు. ఐటీ దాడుల వల్ల టీడీపీ నేతలు వణికిపోతున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో భారీ అవినీతి జరిగిందన్నారు.
ఐటీ దాడులు చేస్తే రాష్ట్రంపై దాడిగా
అక్రమాలు చేస్తున్న కంపెనీలపై ఐటీ దాడులు చేస్తే రాష్ట్రంపై దాడిగా టీడీపీ చిత్రీకరిస్తోందని జీవీఎల్ మండిపడ్డారు. బినామీ ఆస్తులు అయినందుకే లోకేష్ స్పందిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఉక్కు పరిశ్రమ కోసం కడపలో సీఎం రమేష్ దొంగ దీక్ష చేశారన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై టాస్క్ఫోర్స్, మెకాన్కు సమాచారం ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వమే ఆలస్యం చేసిందన్నారు. త్వరలోనే కడప ఫ్యాక్టరీ నిర్ణయం ఉంటుందని కేంద్రమంత్రి హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య చిచ్చుపెట్టేలా టీడీపీ ఎంపీలు వ్యవహరించారన్నారు. తెలంగాణలో సీట్లు, ఓట్ల కోసం టీడీపీ అర్రులు చాస్తోందన్నారు.
సైంధవుడిలా అడ్డుకుంటున్నారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైంధవుడిలా ఏపీ అభివృద్ధికి అడ్డుపడ్డారని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. నాలుగేళ్లుగా అవినీతిని ఎత్తి చూపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. విభజన తర్వాత కేంద్రం నుంచి ఏపీకే అత్యధిక నిధులు వచ్చాయన్నారు.
రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
రాష్ట్రాన్ని చంద్రబాబు, లోకేష్ అడ్డంగా దోచుకుంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీలను చంద్రబాబు అమ్మకానికి పెట్టారని ధ్వజమెత్తారు. పారిశుధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.