రేవంత్ ఇళ్లపై ఐటీ దాడులు: బీజేపీ ఎంపీ జీవీఎల్ ఏమన్నారంటే..?
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు నిర్వహించడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు స్పందించారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రధాన పోటీదారు బీజేపీనేనని, టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా ఎన్నికలకు వెళ్తున్నామని అన్నారు.
అలాంటి తాము టీఆర్ఎస్తో కలిసి రేవంత్పై ఐటీ దాడులు చేయించే అవకాశమే లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. రాజకీయంగా తప్పించుకునేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీ ఇంటిపైనా ఐటీ దాడులు జరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలని జీవీఎల్ చెప్పారు.
అమరావతి బాండ్ల విషయంలో ఇన్వెస్టర్ల పేర్లు బయటపెట్టమంటే... ఏపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని జీవీఎల్ ప్రశ్నించారు. తాను చేసే ప్రతి ఆరోపణకు ఆధారాలు ఉన్నాయని, ప్రభుత్వ సొమ్ముతో దొంగ దీక్షలు చేస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు.
రేవంత్ నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు, కీలక పత్రాలు సీజ్, ఆ రూ.20కోట్లు ఎక్కడివి?
చంద్రబాబు ప్రభుత్వంలో పారదర్శకత లోపించిందని, ప్రకృతి సేద్యంలో నెంబర్ వన్ అంటూ ప్రచార అర్భాటం చేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. ప్రచార ఆర్భాటం, అవినీతి, అప్పు తెచ్చుకోవడంలో మాత్రమే నెంబర్ వన్ అంటూ ఎద్దేవాచేశారు. ప్రధాని మోడీ చరిష్మా, సహకారంతోనే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, వందల కోట్లు వృథా చేసి జీవోలను బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారని జీవీఎల్ విమర్శించారు. జీవోలన్నింటిని ప్రభుత్వం బహిరంగ పరిచేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఐరాసలో చంద్రబాబు పేరు తెచ్చుకుంటే మోడీ ఈర్ష్య పడుతున్నారనడం సరికాదన్నారు జీవీఎల్. 'ప్రకృతి సేద్యంలో ఏం సాధించారని మీకు ఖ్యాతి వస్తుంది. అది కేవలం మీరు చేసుకునే ప్రచారం, ఆత్మస్తుతి మాత్రమే . టీడీపీ పట్ల జాలి తప్ప మాకు ఈర్ష్య పడేంత ఏమీ లేదు. మీకు ఇష్టమైన బ్లూమ్బర్గ్ రిపోర్ట్ చూస్తే మోడీ ఏం సాధించారో మీకే తెలుస్తుంది' అంటూ జీవీఎల్ ట్విట్టర్లో చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. మోడీ నాయకత్వంలోనే ఆరో పెద్ద ఆర్థికశక్తిగా భారత్ ఎదిగిందన్నారు. 2022 నాటికి నాలుగో పెద్ద ఎకానమీ అవుతామని స్పష్టం చేశారు.