ప్రత్యేక హోదా రాష్ట్రాలకు అలా చేయట్లేదు: జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం
ఢిల్లీ: ప్రత్యేక హోదా ప్రయోజనాలు పొందుతున్న రాష్ట్రాలకు నిర్దిష్టమైన రాయితీలు ఏమీ ఇవ్వట్లేదని కేంద్రం పేర్కొంది. ప్రత్యేక హోదాపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.
2015-16 నుంచి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు బ్లాక్ గ్రాంట్లను నిలిపివేసినట్లు కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ లోటు కింద అయిదేళ్లకు గాను రూ.22,112 కోట్లు అందించినట్లు తెలిపింది. ప్రస్తుతం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రయోజనాలు దక్కుతున్నాయన్నది.
హోదా ఇవ్వాలి: సుజన
చట్టబద్ధత లేని విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, పరిహారంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీతోపాటు విదేశీ రుణాల్లో 90 శాతం గ్రాంట్ ఇవ్వాలని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి డిమాండ్ చేశారు. ఆయన గురువారం తన నివాసంలో ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
Recommended Video
విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కున్న ప్రత్యేక పరిస్థితుల్లో హోదా ఇచ్చామని మంగళవారం రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ప్రకటించారని, ఈ విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు, నేటి రాజ్యసభపక్ష నేత అరుణ్ జైట్లీని సంప్రదించాకే తాను ఆ ప్రకటన చేసినట్లు మన్మోహన్ చెప్పారన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూనే మిగతావన్నీ ఇవ్వాలన్నదే మన్మోహన్ సింగ్ ప్రకటన సారాంశమన్నారు. నాలుగేళ్లలో సాయం చేసిన పద్ధతిలో చేస్తే రాష్ట్రం మిగతా రాష్ట్రాల స్థాయికి చేరడానికి నలభై నాలుగేళ్లు పడుతుందని వాపోయారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.6200 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారని, ఆ డబ్బేమీ రాష్ట్రానికి ఇవ్వలేదని, కేంద్ర ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చుకుందన్నారు.
ఈఏపీ నిధులకు బదులు నాబార్డునుంచి ఇవ్వాలని తాము కోరలేదన్నారు. కేంద్రమే ఇందులో జాప్యమవుతుందని చెప్పడం వల్ల ప్రత్యామ్నాయంగా నాబార్డు ద్వారానైనా ఇవ్వాలని అడిగామని, వాళ్లు లేఖ అడిగితే ఇచ్చామన్నారు. కాంట్రాక్టర్లకు ఇష్టానుసారం పందేరం చేయడం కుదరదు కాబట్టే ఈఏపీ నిధులు కాకుండా నాబార్డు ద్వారా అడుగుతున్నారన్న జీవీఎల్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.