జమ్మూకాశ్మీర్, లడఖ్లా ఏపీకి కూడా: బడ్జెట్పై ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ పలువురు రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో జీవీఎల్ వారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
రాష్ట్రాల ప్రాతిపదికన చూడొద్దు..
రాష్ట్రాల అంశాల ప్రాతిపదికన కేంద్ర బడ్జెట్ను చూడటం సరికాదని, అమరావతిలో ఐఐసీహెచ్ ఏర్పాటు చేయాలని కేంద్రాని కోరతానని జీవీఎల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరించి ముందుకెళ్లాలని ఆయన సూచించారు.
జమ్మూకాశ్మీర్, లడఖ్లా ఏపీకి..
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని గతంలోనే వెల్లడించామన్నారు. రాజకీయ లబ్ధి కోసమే హోదా అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. జమ్మూకాశ్మీర్, లడఖ్లకు ఇచ్చిన్లే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా నిధులను కేంద్రం అందజేస్తుందని జీవీఎల్ నర్సింహరావు స్పష్టం చేశారు.
ఏపీ నుంచి ప్రతిపాదనలు రాకపోవడం వల్లే..
రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల మేరకు బడ్జెట్లో మౌలిక వసతుల కల్పన చేపట్టినట్లు జీవీఎల్ తెలిపారు. అయితే, ఆశించిన స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదనే సమాచారం ఉందని చెప్పారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి యూసీలు ఇంకా రావాల్సి ఉందని అన్నారు.
వైసీపీ అసంతృప్తి.. స్వాగతించిన పవన్ కళ్యాణ్
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఏపీ ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలు కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎలాంటి నిధులు కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు కూడా కేంద్ర బడ్జెట్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, జనసేన మాత్రం కేంద్ర బడ్జెట్ను స్వాగతించింది. దేశ సమగ్ర అభివృద్ధికి దోహదపడే బడ్జెట్ అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. వ్యవసాయ రంగానికి, గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేశారని కొనియాడారు. గొప్ప బడ్జెట్ ఇచ్చారంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.