ఏపీపై అమిత్ షా ఎమోషనల్, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారం దూరమే: జీవీఎల్
న్యూఢిల్లీ/అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలతో భేటీ అనంతరం కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీ సీఎంగా పనిచేయడం లేదని టీడీపీ అధ్యక్షుడిగానే పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రజా ధనం దుర్వినియోగం
బీజేపీ అధికార ప్రతినిధులమైన తాము రాష్ట్రం కోసం పనిచేస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రజల కోసం ముఖ్యమంత్రి బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నామని చెప్పారు. ప్రజల ధనం దుర్వినియోగం చేస్తూ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారని చంద్రబాబుపై జీవీఎల్ మండిపడ్డారు. ఇది ప్రజలకు అవమానం, అన్యాయమని అన్నారు.
ఏపీ ప్రజలపై అమిత్ షా ఎమోషనల్గా..
రాష్ట్రానికి చెందిన నాయకులుగా ప్రధాని మోడీ, బీజేపీ అధినేత అమిత్ షాలతో ఏపీ అభివృద్ధిపై చర్చించామని తెలిపారు. ఏపీ ప్రజలపై అమిత్ షా ఎమోషనల్గా ఫీలయ్యారని అన్నారు. ఏపీకి విభజనతో అన్యాయం జరిగిందని, అందుకే ఏపీపై ప్రత్యేక శ్రద్ధతో చూపించి ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరిద్దామని అమిత్ షా చెప్పారని తెలిపారు. షా మాటలతో రాష్ట్ర నాయకుడిగా తనకు ఆనందం వేసిందని అన్నారు. టీడీపీ నేతల్లా తమ నేతలు సంకుచిత భావాన్ని కలిగి ఉండరని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారం దూరం
టీడీపీ ప్రభుత్వం ప్రతీ ప్రాజెక్టులోనూ రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం బాధిస్తోందని జీవీఎల్ నర్సింహారావు అన్నారు. అవినీతి, అక్రమాలు లేకుండా ఏ ప్రాజెక్టును కదలనివ్వడం లేదని ఆరోపించారు. ఏపీ ప్రజలు టీడీపీ అవినీతిని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అధికారం నుంచి దూరం పెడతారని అన్నారు.
అది టీడీపీకి అలవాటే
అవినీతిని అడ్డుకుంటోందనే కేంద్రంపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు. అధికారం ఉండగానే వెనకేసుకోవడం టీడీపీకి అలవాటేనని అన్నారు. కేంద్రం ఏపీకి సాయం చేసిందని, ఇంకా చేస్తుందని తాము గర్వంగా చెబుతామని జీవీఎల్ నర్సింహారావు చెప్పారు.