డ్రామాలు ఆపాలి! ఏడాదిగా కుంభకర్ణుడిలా నిద్రపోయి: బాబుపై జీవీఎల్ నిప్పులు
న్యూఢిల్లీ: కేంద్రంపై టీడీపీ నేతలు నిరాధారంగా ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేవలం రాజకీయ కారణాల వల్లే టీడీపీ నేతలు బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వాధికారులకి మే 30, 2018న ఓ లేఖ అందిందని, ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి కేంద్ర సర్కారు నుంచి ఏయే ప్రయోజనాలు వచ్చాయో రాష్ట్ర ప్రభుత్వ అధికారులే అందులో పేర్కొన్నారని ఆ లేఖను చూపించారు. మరోవైపు ప్రత్యేక ప్యాకేజీ కింద కూడా ఎటువంటి ప్రయోజనాలు రాలేదని టీడీపీ నేతలు అంటున్నారని జీవీఎల్ అన్నారు.
నిధులు ఇచ్చినా..
ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని, అయినప్పటికీ టీడీపీ నేతలు ఇలా మాట్లాడడం అభ్యంతరకరమని అన్నారు. ఏపీ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ను ప్రపంచ బ్యాంక్ నిధులతో రాష్ట్రం సర్కారు దక్కించుకుందని, అంటే ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న 2,220 కోట్ల రూపాయల రుణాన్ని కేంద్ర సర్కారే చెల్లిస్తుందని అన్నారు.
ఏపీ అభివృద్ధి కోసం..
గ్రామీణ అభివృద్ధికి రూ. 642 కోట్లు, విద్యుత్ ప్రాజెక్టుకు రూ. 3584 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి వైజాగ్-చెన్నై కారిడార్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రూ. 12,472 కోట్లను చెల్లించేందుకు కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు.
తెలుగు డ్రామా పార్టీ నాటకాలు ఆపాలి.. నివేదిక ఏది?
టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కడప స్టీల్ ప్లాంటు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరాలు పంపడం లేదని చెప్పారు. తెలుగు డ్రామా పార్టీ నాటకాలు ఆపాలని అన్నారు. ముడి సరుకు అందుబాటులో ఉందా? లేదా? అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీంతో ఏడాదిగా మెకాన్ సమాచారం కోసం ఎదురుచూస్తోందని చెప్పారు.
ఏడాదిగా కుంభకర్ణుడిలా నిద్రపోయి..
మెకాన్ ఇచ్చే ఫీజిబిలిటీ రిపోర్టు ఆధారంగా కేంద్రం కడప స్టీల్ ప్లాంట్పై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతూ కేవలం ప్రచారానికే పరిమితమైందని మండిపడ్డారు. దీక్షలు చేస్తున్న నాయకులు స్టీల్ ప్లాంట్కు ముడిసరుకు అందుబాటుపై వివరాలు పంపాలని చంద్రబాబును అడగాలని సూచించారు. గతంలో స్పెషల్ పర్పస్ వెహికల్ వద్దని ఏపీ మంత్రి యనమల చెప్పారని, ఎస్పీవీ కావాలని మళ్లీ అడిగితే కేంద్రం అందుకు తగిన చర్యలు తీసుకుంటుందని జీవీఎల్ పేర్కొన్నారు.