రెచ్చగొడుతావా, టీడీపీని మరిచేవారు, సినిమాల్లేని హీరోతో: బాబుకు జీవీఎల్ దిమ్మతిరిగే షాక్
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేసిన విమర్శలకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు బుధవారం కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు రాష్ట్రంలో రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కావాలనే ప్రధాని నరేంద్ర మోడీని కించపరిచేలా విమర్శలు చేస్తున్నారన్నారు.
యూసీలకు సరైన సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి అలా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాల్లోను ఇలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక హోదా ముసుగులో అన్ని పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
పొత్తు లేకుంటే టీడీపీని మరిచిపోయేవారు
తమ పార్టీతో పొత్తు లేకుంటే ఈ పాటికి తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎప్పుడో మరిచిపోయేవారని జీవీఎల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీతో పొత్తు కారణంగా తమకు 15 సీట్లు తగ్గాయని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో అసలు మాతో పొత్తు లేకుంటే అప్పటికే పదేళ్లు అధికారంలో లేని టీడీపీని ప్రజలు మరిచిపోయేవారని కౌంటర్ ఇచ్చారు.
పొత్తు కోసం తహతహ
2014లో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడారని జీవీఎల్ నర్సింహా రావు అన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కేవలం 5 లక్షల ఓట్ల మెజార్టీతోనే అని చంద్రబాబు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత జగన్ కూడా పదేపదే ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
సినిమాలు లేని హీరోతో, దగాకోరు రాజకీయాలు
కేంద్రం ఇచ్చిన నిధుల గురించి చెప్పకుండా చంద్రబాబు దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని జీవీఎల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమాలు లేని ఓ హీరో, సీనియర్ రాజకీయ నాయకుడి పేరుతో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. నటుడు శివాజీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆపరేషన్ గరుడ
నాలుగేళ్లు కేంద్రమంత్రులుగా ఉన్న సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు మాట్లాడలేదని జీవీఎల్ ప్రశ్నించారు. బీజేపీని చూసి ప్రాంతీయ పార్టీలకు గుబులు పట్టుకుందన్నారు. రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుందనే భయంతో 2014లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందన్నారు. ఏపీలో ఆపరేషన్ గరుడ లాంటివేమీ లేవన్నారు. బీజేపీ అంటే కేవలం దడ మాత్రమే అన్నారు. 2019లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదన్నారు.
ధీటుగా స్పందించండి
ఇదిలా ఉండగా, ఏపీ బీజేపీ నేతలతో జీవీఎల్ నర్సింహారావు బుధవారం భేటీ అయ్యారు. టీడీపీ విమర్శలకు సరైన విధంగా కౌంటర్ ఇవ్వాలని సూచించారు. మనం ఏపీకి అన్యాయం చేయలేదని, ప్రత్యేక హోదా ఇవ్వలేమని నాలుగేళ్లుగా చెబుతున్నామని, దానికి బదులు సమానమైన ప్యాకేజీ ఇస్తున్నామని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని సూచించారు.